కళామతల్లిపై ఏపీ ప్రభుత్వం దాడి: అదో బ్రోతల్ హౌస్: కొడాలి నాని క్యాసినో కంటే ఘోరమా: నారాయణ
అమరావతి: దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సాధించిన చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్పందించారు. ఈ నాటకాన్ని నిషేధించడాన్ని తప్పుపట్టారు. ఇది సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా గానీ, సామాజికంగా గానీ ఎవరినీ కించపరిచేలా, ఎవరి మనోభావాలను దెబ్బతీయని విధంగా ఈ నాటకం ఉందని, అలాంటప్పుడు నిషేధించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మీ చేతుల్లో రాష్ట్రం సురక్షితం: వైఎస్ జగన్కు నటుడు కైకాల సత్యనారాయణ భావోద్వేగ లేఖ
దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన నాటకంగా..
20వ దశాబ్దంలో అప్పటి సామాజికాంశాలు, వేశ్యావృత్తి, అందులోని ఇబ్బందులు, దాని వల్ల ఉత్పన్నమౌతున్న సమస్యల ఆధారంగా కాళ్లకూరి నారాయణరావు చింతామణి నాటకాన్ని రచించారు. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పర్వదినాలతో పాటు స్థానికంగా జరిగే జాతరల సందర్భంగా ఇప్పటికీ ఈ నాటకం ప్రదర్శితమవుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా 446 సార్లు చింతామణి నాటకం ప్రదర్శితమైంది. చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, చిత్ర వంటి పాత్రల పేర్లు తెలుగునాట నాటుకుపోయాయి.
ఆర్యవైశ్యుల డిమాండ్తో..
ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర.. ఆర్యవైశ్యులను దృష్టిలో పెట్టుకుని రచించారని, ఇప్పటి సమకాలీన పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. సుబ్బిశెట్టి పాత్ర తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, ఈ నాటకాన్ని నిషేధించాలంటూ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాలానుగుణంగా కాల్పనికత, ద్వంద్వార్థాలను జోడించి.. ప్రదర్శిస్తోన్నారనేది వారి వాదన. ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.. నిషేధించింది. ఇటీవలే జీవో నంబర్ 7ను విడుదల చేసింది.
మిశ్రమ స్పందన..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. ఆర్యవైశ్య సామాజిక వర్గం స్వాగతించింది. నిషేధించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం నుంచి తాము ఈ డిమాండ్ను చేస్తున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతున్నాయి. అదే సమయంలో పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. సందేశాత్మక నాటకాన్ని నిషేధించడం సరికాదని, ఇందులోని సామాజిక స్ఫూర్తిని స్వీకరించాలే తప్ప.. ఒక కులాన్ని కించపరిచినట్లుగా భావించకూడదనే అభిప్రాయాలు వినిపించాయి.
కళామతల్లిపై దాడి..
తాజాగా- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. 1923లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రచించారని, అలాంటి చారిత్రాత్మక నాటకాన్ని నిషేధించడం విచిత్రంగా ఉందని అన్నారు. ఒరిజినల్లో ఎక్కడా బూతుపదాలు లేవని, ఆ తరువాత ఇందులో అలాంటి పదాలు జత అయి ఉండొచ్చని చెప్పారు. దీన్ని పరిశీలించకుండా అసలు నాటకాన్నే నిషేధించడం.. కళామతల్లిపై దాడి చేసినట్టేనని అన్నారు. ఒరిజినల్ నాటకాన్ని చూసే.. తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.
బిగ్బాస్ కంటే ఎక్కువ బూతులున్నాయా?
చింతామణి నాటకంతో పోల్చుకుంటే- టీవీ రియాలిటీ షో బిగ్బాస్లో బూతులు తక్కువగా ఉన్నాయా? అని నారాయణ ప్రశ్నించారు. బిగ్బాస్ ఓ బ్రోతల్ హౌస్ అని.. దాన్ని ఎలా నడిపిస్తున్నారని నిలదీశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన క్యాసినోల కంటే చింతామణి నాటక ప్రదర్శన ఘోరమైనదేమీ కాదని ఆరోపించారు. మంత్రులే పచ్చి బూతులను మాట్లాడుతున్నారని, అంతకుమించిన బూతులు చింతామణిలో లేవని చెప్పారు. ఈ నాటకాన్ని నిషేధించే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. అందులో వచ్చే బూతుల విషయాన్ని ప్రజలు, కళాకారులు చూసుకుంటారని, దీని జోలికి ప్రభుత్వం వెళ్లకూడదని డిమాండ్ చేశారు.