బాస్కెట్ బాల్ ఆడిన నారాయణ: దాసరితో జగన్ భేటీపై ఆసక్తికరమైన వ్యాఖ్య
గుంటూరు: ఇటీవల హైదరాబాదులో హిందీ పాటకు డ్యాన్స్ చేసిన సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం గంట సేపు వాకింగ్ చేశారు. అనంతరం నారాయణ కొద్దిసేపు బాస్కెట్ బాల్ ఆడారు.
పార్టీ సమావేశాల్లో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన బాల్య మిత్రుడు మాజీ ఎమ్మెల్యే జయరాంబాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మాదా ముత్యాలరావు, బీజేపీ నాయకుడు జగన్మోహనరావు, విశ్రాంత ఏఎస్సీ కాళహస్తి సత్యనారాయణ, మాధవరెడ్డి, రామకృష్ణ, టీడీపీ నాయకుడు నాగళ్ల తిరుపతయ్య తదితరులతో కలిసి వాకింగ్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని నారాయణ అన్నారు. గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న తప్పులకు జగన్ ఊపిరి పోస్తున్నాడన్నారు.
దాసరి నారాయణరావును జగన్ కలవడమంటే జైలు పక్షులన్నీ ఒకే గూటికి చేరడమేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మార్చడం, కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. భీమవరం నుంచి పోటీ చేయడం వంటివి జరిగితే తన చెవి కోసుకుంటానని అన్నారు.