వ్యతిరేకిస్తే వ్యవస్థనే లేకుండా చేస్తారా ? సీఎం జగన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఫైర్
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రాజధాని విభజన బిల్లును శాసన మండలి తిరస్కరించలేదని, కేవలం సెలెక్ట్ కమిటీకి పంపిందని, అంతమాత్రానికే మండలిని రద్దు చేస్తామని అనడం దారుణం అని ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్కు ఇలాంటి నిర్ణయం తగదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అసెంబ్లీలో రాజధాని తీర్మానం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న రామకృష్ణ, మండలిలో మాట చెల్లుబాటు కాలేదన్న కారణంగానే మండలి రద్దు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ పేర్కొన్న రామకృష్ణ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఎద్దేవా చేశారు. జగన్ తన సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దుతూ లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు . రాజధాని అన్నది రాజ్యాంగంలో లేనప్పుడు మూడు రాజధానులు ఎందుకని, అటువంటప్పుడు ఇడుపులపాయ నుంచే పాలన సాగించవచ్చుకదా అని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

పేదరాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు రూ.5 కోట్లు ఖర్చా ?
ఏపీ పేద రాష్ట్రం కాబట్టి మండలి అవసరమా అన్న జగన్ రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు రూ.5 కోట్లు ఇచ్చి న్యాయవాదిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని తనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి అడ్వకేట్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అది ప్రజాధనమని దాన్ని అమరావతి రైతులకు వ్యతిరేకంగా వాదించటానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

తండ్రి శాసనమండలి పునరుద్ధరిస్తే కొడుకు రద్దు చేస్తాడా ?
జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ, అభివృద్ధి నిరోధకంగా తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే నియంతలా వ్యవహరిస్తున్నారనీ జగన్ పై అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలన్నింటినీ జగన్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాశనం చేస్తున్నారని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. నాడు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కౌన్సిల్ ను పునరిద్ధరిస్తే ఆయన కుమారుడు జగన్ కౌన్సిల్ ను రద్దు చేయటానికి పూనుకున్నారని మండిపడ్డారు .

ఏపీలో జగన్, విజయసాయిరెడ్డి చేతుల్లో వ్యవస్థ
తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు బనాయిస్తూ ఏకంగా వ్యవస్థలనే రద్దు చేస్తున్నారని విమర్శించారు సీపీఐ నేత రామకృష్ణ . రాష్ట్ర రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు పోరాటాలు చేస్తుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారనీ ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్, విజయసాయిరెడ్డి చేతుల్లోకి వ్యవస్థ నడుస్తోందని పేర్కొన్న రామకృష్ణ వీరిద్దరూ కలిసి ఏపీలోని 5 కోట్లమంది ప్రజల తలరాతల్ని రాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .












Click it and Unblock the Notifications