ప్యాకేజీలేవి: కేంద్రంపై టిడిపి ఎంపీ, విందు ఇచ్చిన రాయపాటికి షాకిచ్చిన సిపిఐ
గుంటూరు: కేంద్ర ప్రకటిస్తున్న ప్యాకేజీలు వాస్తవ రూపం దాల్చడం లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సిపిఐ నేతలు నారాయణ, సురవరం సుధాకర్ రెడ్డి తదితరులకు విందు ఇచ్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీలు వాస్తవ రూపం దాల్చడం లేదన్నారు. కేంద్రం ప్యాకేజీలు ప్రకటిస్తుందే తప్ప నిధులు మాత్రం విడుదల కావడం లేదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధిని కోరుకుంటామని చెప్పారు.
ఇతర ప్రాంతాల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలన్నారు. కాగా, సీపీఐ నేతలతో భేటీ సందర్భంగా... భవిష్యత్తులో టిడిపితో కలిసి పని చేయాలని వారిని కోరినట్లు చెప్పారు.
కాగా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆదివారం ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఇంటికి వరుస కట్టారు. రాయపాటి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి సీపీఐ నేతలు అల్పాహార విందుకు హాజరయ్యారు.
తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటి దాకా వచ్చిన లెఫ్టిస్టు నేతలకు రాయపాటి ఘనంగానే విందు ఇచ్చారు. ఈ సమయంలో టీడీపీతో కలిసి పని చేసే విషయమై ఆలోచించాలని రాయపాటి సిపిఐ నేతలకు సూచించారు. అయితే రాయపాటి ప్రతిపాదనపై సురవరం ఘాటుగా స్పందించారు.
బీజేపీతో కలిసి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదని రాయపాటి ముఖం మీదే సురవరం చెప్పేశారని తెలుస్తోంది. దీంతో రాయపాటి కంగుతిన్నారు. ఆ తర్వాత తనను తాను సర్దుకున్న రాయపాటి.. సీపీఐ నేతలతో తనకున్న ఆత్మీయ అనుబంధంతోనే వారిని తన ఇంటికి ఆహ్వానించానని చెప్పారు.