ఏపీ మోడీకి కట్టుకున్న పెళ్లాం: వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మీ నడుముతో పోల్చిన నారాయణ
అమరావతి: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధాని మోడీతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులపై మండిపడ్డారు. గురువారం గంటూరులో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకయ్య నాలుక జ్యోతిలక్ష్మి నడుములాంటిదని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
పార్లమెంటులో ఏపీ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్య, తాజాగా కుంటి సాకులు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మి నడుముతో పోల్చారు.
వెంకయ్య నాలుక జ్యోతిలక్ష్మి నడుములా ఎటుబడితే అటు తిరుగుతుందని ఆరోపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ కట్టుకున్న పెళ్లామని అన్నారు. కట్టుకున్న పెళ్లాం లాంటి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ‘నీతో ఉండను' పొమ్మంటున్నారన్నారు.
ఏపీని కేంద్రం ఆదుకుంటుంది: కేంద్రమంత్రి వెంకయ్య
భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ వరద నష్టం వివరాలను ప్రధాని మోడీ సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.
వరదలు తగ్గుముఖం పట్టగానే దెబ్బతిన్న జాతీయ రహదారులను పునరుద్ధరిస్తామన్నారు. శనివారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించనున్నట్లు వెంకయ్య తెలిపారు.