తొక్కేసేందుకే: జగన్, కల్సిన జేసీ, సీఎంలకు నారాయణ
హైదరాబాద్: అసెంబ్లీలో తమను తొక్కేసే ప్రయత్నం అధికార పక్షం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. శాసన సభ గురువారానికి వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారం పక్షం నియంత పోకడలతో వ్యవహిరిస్తుంతోందన్నారు.
బడ్జెట్ పైన అసెంబ్లీలో ఆరు రోజులు చర్చ జరగాల్సి ఉండగా కేవలం నాలుగు రోజులకే కుదించారన్నారు. అసెంబ్లీలో సాధారణంగా ప్రజల కిచ్చిన హామీలను, ప్రజాసమస్యలను ప్రస్తావించేది ప్రతిపక్ష పార్టీనే అన్నారు. కానీ ప్రతిపక్షమైన తమకు ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు స్పీకర్ తగిన సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఈరోజు తన ప్రసంగం ముగించడానికి మరో అరగంట సమయం ఇవ్వాలని అడిగినా స్పీకర్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. టీడీపీ సభ్యులకు మాత్రం స్పీకర్ ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు ఐదేళ్ల క్రితం చనిపోయిన వైయస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టడం తప్ప వేరే పని లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కేటాయింపులన్నీ తక్కువే అన్నారు.
జగన్తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ
అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో టీడీపీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. భేటీపై ప్రశ్నించగా.. జగన్ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, తామిద్దరి మద్య ఎలాంటి రాజకీయవిషయాలు ప్రస్తావనకు రాలేదని జేసీ చెప్పారు. కేవలం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అసెంబ్లీని పరిశీలించడానికే తాను వచ్చానని తెలిపారు.
సయోధ్యతో అభివృద్ధి: నారాయణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సయోధ్యతోనే అభివృద్ధి చెందుతాయని సీపీఐ నాయకులు నారాయణ అదిలాబాద్ జిల్లాలో అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలపై చర్చించుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టుకోవాలన్నారు. తెరాస ప్రభుత్వం డిస్కంలను ప్రయివేటు పరం చేసేందుకు కసరత్తు చేస్తోందని, ఇంటింటి సర్వేతో నిధులు దుర్వినియోగం తప్ప ప్రయోజనం లేదన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు సింగపూర్లా అభివృద్ధి అంటూ మాటల గారడి చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాదును ఈవెంట్ హబ్గా చేస్తాం: కేటీఆర్
హైదరాబాదును ఈవెంట్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రతిరోజు నగరంలో ఓదో ఒక భారీ ఈవెంట్ జరగాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలు చేపడుతుందని, ఈవెంట్ల నిర్వహణకు అనుమతులకు సింగిల్ విండోవిధానం అమలు చేస్తామన్నారు.