వారిది ఢిల్లీలో భరతనాట్యం, ఏపీలో శివతాండవం; పవన్ త్రిశంకుస్వర్గంలో: సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో వచ్చేఎన్నికలలో పొత్తుల విషయంలో రాజకీయవర్గాలలో ఇప్పటి నుంచే డిబేట్ కొనసాగుతోంది. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ వ్యాఖ్యలను స్వాగతించిన నారాయణకు అన్నీ అనుమానాలే
తిరుపతిలో ఏపీ రాజకీయాల పై స్పందించిన సీపీఐ నారాయణ ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ వైసిపి వ్యతిరేక ఓట్లను చీల్చము అన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఆయన అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. బిజెపి ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డు మ్యాప్ ఇస్తుందో చెప్పాలని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. వైసిపి, బీజేపీలు ఏపీలో లివింగ్ టుగెదర్ లో ఉన్నాయని, సహజీవనం చేస్తున్నాయని సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసిపి, బిజెపిల సహజీవనం మధ్య పవన్ కళ్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో?
వైసిపి, బిజెపిల సహజీవనం మధ్య పవన్ కళ్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో అర్థం కావడం లేదని సిపిఐ నారాయణ వెల్లడించారు. వైసిపి నాయకులు ఢిల్లీలో ఒకలా ఏపీలో ఇంకోలా ప్రవర్తిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. వైసిపి నాయకులు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ ఏపీలో శివతాండవమాడుతున్నారని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రిశంకుస్వర్గంలో ఉన్నారని పేర్కొన్న నారాయణ, జనసేనానిలో రాజకీయ స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.

వైసీపీని వ్యతిరేకించే వారితో పొత్తులు.. పవన్ ఉద్దేశం ఏమిటో?
పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో వైసీపీని వ్యతిరేకించే వారితో పొత్తులు ఉంటాయని చెప్పారో అర్థం కాలేదని నారాయణ వ్యాఖ్యానించారు. దేశంలో కమ్యూనిస్టుల బలం బాగా తగ్గిపోయిందని ఒప్పుకున్న నారాయణ, తాము బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు తమ దగ్గరకు వచ్చాయని, ఇప్పుడు బలం తగ్గడంతో తమ దగ్గరకు ఏ పార్టీ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం ముఖ్యమని సిపిఐ నారాయణ వెల్లడించారు.

వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ చెప్పకనే చెప్పాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన నుద్దేశించి వ్యాఖ్యలు చేసిన నారాయణ కబ్జాల నుంచి, అరాచకాల నుంచి, దౌర్జన్యాల నుంచి బయటకు రావాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారని, వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ మాటలతోనే అర్థమవుతోందని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్లు రాష్ట్రాన్ని దోచేశామని చెప్పకనే చెప్పారని సిపిఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications