ఏపీ సీఎస్ చదువుకున్న మూర్డుడు.. సీఎం సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు.. నారాయణ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ చిచ్చు చల్లాడం లేదు. ఉద్యోగులు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. జగన్ సర్కార్ తీసువచ్చిన కొత్త పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరికి విపక్షాలు మద్దతు పలికాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ సీఎస్ సునీల్ శర్మ చదువుకున్న మూర్ఖుడంటూ ఆంగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..
ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్కు పాల్పడుతుందని నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరిగా రాష్ట్రంపై పడి తిరుగుతున్నారని విమర్శించారు. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు అంతమంది సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. వారి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనంలేదన్నారు. లక్షలకు లక్షలు వారికి ప్రజాధనాన్ని జీతాల రూపంలో కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. లెక్కకు మించి సలహాదారులు దేనికని ప్రశ్నించారు.
ప్రభుత్వ సలహాదారులు అచ్చొసిన ఆంబోతులు
అచ్చొసిన ఆంబోతులుగా తిరుగుతున్న ప్రభుత్వ సలహాదారులతో సీఎం జగన్ కు నష్టమే తప్పా.. ప్రయోజనం లేదని నారాయణ విమర్శించారు. ఉద్యోగులు న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరచలేకపోయిందని విమర్శించారు. సీఎస్ సునీల్ శర్మ చదువుకున్న మూర్ఖుడంటూ మండిపడ్డారు. పీఆర్సీ రిపోర్ట్ కమిటీతో చేసినది కాకుండా.. సీఎస్ తన రిపోర్ట్ ప్రకారం హెచ్ఆర్ఏను బాగా తగ్గించేసి ఉద్యోగులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు.
ఉద్యోగులు ఆశించనమేరకు పీఆర్సీ ఇవ్వలేకపోయాం.
కాగా, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందనేని అవాస్తమన్నారు మంత్రి పేర్నినాని. ఉద్యోగులు తమ మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు ఆశించనమేరకు పీఆర్సీ ఇవ్వలేకపోవడం బాధాకరమే అని అన్నారు. ఉద్యోగులను యూనియన్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం
పీఆర్సీపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గతంలో ఉన్న విధానాన్నే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని పేర్నినాని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని మంత్రి పేర్నినాని గుర్తు చేశారు..