స్టెరాయిడ్స్ వల్లే కోటయ్యకు అస్వస్థత-కార్పోరేట్ గోల ఎక్కువైంది-ఆనందయ్య మందుపై సీపీఐ నారాయణ
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆనందయ్య నాటు మందు పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అది అసలు మందే కాదని కొట్టిపారేస్తున్నవారు కొందరు.. ప్రజలను బతికించేందుకు ఏ మందు అయితే ఏంటని మరికొందరు... ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్లోపతి వర్సెస్ ఆయుర్వేద వైద్యం,మందులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ వివాదంపై స్పందించారు.
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై కార్పోరేట్ ఆస్పత్రుల గోల ఎక్కువైపోయిందని నారాయణ విమర్శించారు. ఇలాంటి మందులపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. ఆనందయ్య వద్ద మందు తీసుకున్న కోటయ్య అనే హెడ్ మాస్టర్... స్టెరాయిడ్స్ వాడటం వల్లే అస్వస్థతకు గురయ్యాడని చెప్పారు. అంతే తప్ప ఆనందయ్య మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని అన్నారు.
ఆదివారం(మే 23) సీపీఐ నారాయణ కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి మందుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆనందయ్య మందుతో ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని తెలిపారు.
మరోవైపు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై దుష్ప్రచారం వద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్,ఆయుష్ అధికారులు నివేదికలు ఇచ్చాక... మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మందు పనిచేస్తుందని ఇప్పటికే రుజువైనప్పటికీ... శాస్త్రీయంగా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని నిర్దారించేందుకే దానిపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఆనందయ్య మందుపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం సరికాదన్నారు.
రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు నేత్రుత్వంలోని బృందం శనివారం(మే 22) నెల్లూరులో ఆనందయ్య నాటు మందు తయారీని ప్రత్యక్షంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ మందును ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చాక దానిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రాథమిక అధ్యయనం ప్రకారం... ఆనందయ్య మందులో ఎటువంటి హానికారక పదార్థాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. కాబట్టి దీన్ని వాడటం హానికారకం కాదని స్పష్టం చేశారు. అయితే ఇది ఆయుర్వేద మందు కాదని... ఆయుర్వేద ప్రోటోకాల్స్ ఇందులో పాటించడం లేదని తెలిపారు. కాబట్టి దీన్ని నాటు మందుగానే గుర్తిస్తున్నామని చెప్పారు.