ప్రధాని మోదీ - షా ఏపీలో ఆ పార్టీ తోనే : మేము సిద్దం - సీపీఐ రామకృష్ణ..!!
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలపైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు - పవన్ కల్యాణ్ తాజా భేటీ తరువాత ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని..ఇందు కోసం వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని సూచించారు. దీని పైన ఇప్పటికే టీడీపీతో సఖ్యత కొనసాగిస్తూ..జనసేన మాజీ మిత్రపక్షమైన సీపీఐ స్పందించింది. చంద్రబాబు - పవన్ తో కలిసి పని చేయటానికి తాము సిద్దమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేసారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగటం పైన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. పవన్ బీజేపీని వీడితేనే తాము కలిసి పని చేస్తామని స్పష్టం చేసారు.
ఏం చేయలేని వీర్రాజు పోరాడితే ఎంత..లేకుంటే ఎంత అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలో వైసీపీని వాటేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీని ద్వారా బీజేపీ అధినాయకత్వం వైసీపీతోనే ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేసారు. విశాఖలో పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేయటం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరును తప్పు బట్టారు. పవన్ కు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ప్రభుత్వ తీరు పైన ఉమ్మడి కార్యాచరణ అవసరమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సీపీఎం నేత శ్రీనివాస రావు సైతం ఇదే తరహాలో స్పందించారు.

సీఎం జగన్ కు బ్రేకులు వేయాలంటే బీజేపీ పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రతిపక్షాలు కలిసి కట్టుగా జగన్ ప్రభుత్వం పైన పోరాటం కోసం మళ్లీ మళ్లీ సమావేశం అవుతామని చంద్రబాబు స్పష్టం చేసారు. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు - పవన్ భేటీ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించలేదు. ఈ సాయంత్రం అందుబాటులో ఉన్న బీజేపీ నేతలతో సోము వీర్రాజు భేటీ కానున్నారు. దీని పైన మరింత స్పష్టత వచ్చిన తరువాతనే స్పందించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications