నకిలీ సర్టిఫికెట్లు, ఫోటోలతో క్రెడిట్ కార్డులు: రూ.2.39 కోట్లు కొల్లగొట్టిన 4 ముఠాలు
హైదరాబాద్: తప్పుడు పే స్లిప్లు, సర్టిపికెట్లను సృష్టించి ఇంటర్నెట్ నుండి ఫోటోలను డౌన్లోడ్ చేసి క్రెడిట్ కార్డులను సంపాదించి కోట్లాది రూపాయాలను బ్యాంకులకు కొల్లగొట్టారు. బ్యాంకుల నుండి సుమారు రూ. 2.39 కోట్లను కొల్లగొట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు గ్యాంగ్లను అరెస్ట్ చేశారు.
టెక్నాలజీని ఉపయోగించుకొని తప్పుడు పద్దతుల ద్వారా క్రెడిట్ కార్డులు పొంది బ్యాంకులను బురిడి కొట్టిస్తున్నారు. ఈ తరహ మోసానికి పాల్పడిన 16 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంటర్నెట్ నుండి వ్యక్తుల ఫోటోలను డౌన్లోడ్ చేసి తప్పుడు పత్రాలతో పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులను పొంది బ్యాంకుల నుండి డబ్బులను కొల్లగొడుతున్నారు.
క్రెడిట్ కార్డులతో రూ. 2.39 కోట్లు స్వాహా
తప్పుడు ధృవీకరణ పత్రాలతో క్రెడిట్ కార్డులను పొంది బ్యాంకుల నుండి రూ. 2.39 కోట్లను స్వాహా చేసిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు నాలుగు ముఠాలు క్రెడిట్ కార్డులతో బ్యాంకులను బురిడీ కొట్టించాయి. ఇంటర్నెట్ నుంచి అమాయకుల ఫొటోలను డౌన్లోడ్ చేసి నకిలీ పే స్లిప్లు, ధ్రువపత్రాలు సృష్టించి వాటి ద్వారా పాన్కార్డులు, క్రెడిట్ కార్డులు సంపాదించారు. ఆ కార్డులతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నాలుగు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 మందిని అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ వి.సి.సజ్జనార్ తెలిపారు.
తప్పుడు సర్టిపికెట్లు
కడప జిల్లా కొంపల్లికి చెందిన పెద్దినేని శివరామ్కుమార్ బ్యాంకు లోన్, క్రెడిట్కార్డు, పాన్కార్డులు కావాల్సిన వారికి డబ్బు తీసుకొని నకిలీ ఓటర్ ఐడీలు, పే స్లిప్లు, అడ్రస్ప్రూఫ్లు వంటివి తయారు చేసి ఇస్తుండేవాడు. మరో 8 మందితో ఒక ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ ధ్రువపత్రాల కోసం వచ్చే వారి నుంచి, తెలిసిన వారివి, ఉద్యోగాల కోసం వచ్చే వారి ఫొటోలు సేకరించేవారు. నకిలీ ధ్రువపత్రాలపై గుంటూరు జిల్లా మాడుగుల పీహెచ్సీలో పనిచేస్తున్న డిప్యూటీ పారామెడికల్ అధికారి మోషేతో గెజిటెడ్ సంతకాలు చేయించేవారు. అనంతరం పాన్కార్డులు ఇప్పించే ఏజెన్సీలోని ఉద్యోగులను మేనేజ్ చేసి కార్డులు తెప్పించుకునేవారు. ఆ తర్వాత బ్యాంకులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో కుమ్మక్కై క్రెడిట్కార్డులు సంపాదించేవారు.
బాధితురాలి ఫిర్యాదు
తప్పుడు పత్రాలతో పొందిన క్రెడిట్ కార్డుతో ఖరీదైన వస్తువులను కొని వాటిని బయట మార్కెట్లో విక్రయించి సొమ్మును చేసుకొనేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే తరహలో నవీనజ్యోతి పేరిట తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎస్బీఐ నుండి క్రెడిట్ కార్డు తీసుకొన్నారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 88, 654 వాడుకొన్నారు. ఈ విషయం నవీనజ్యోతి దృష్టికి వచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శివరామ్కుమార్ను అరెస్ట్ చేశారు.
33 క్రెడిట్ కార్డులతో లక్షలు
ఇప్పటి వరకు శివరామ్ ముఠా సభ్యులు ఎస్బీఐ నుంచి 33 క్రెడిట్ కార్డులను పొంది రూ.36,83,509 కొల్లగొట్టారు. బజాజ్ ఫైనాన్స్ నుంచి ఈఎంఐ పద్దతిలో రూ.37,89,255 విలువైన ఎల్ఈడీ టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు కొని వాటిని బయట మార్కెట్లో అమ్మేసి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది ఉన్న ఈ ముఠాలో 9మందిని అరెస్టు చేశారు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన పల్లెర ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని రెండో ముఠా ఎస్బీఐ నుంచి 17 క్రెడిట్ కార్డులు పొందింది. వాటితో రూ.1,45,50,512లు కొల్లగొట్టారు. నల్గొండకు చెందిన రామయ్య బిఎన్ రెడ్డి కార్పోరేటర్ లక్ష్మీప్రసన్న పేరుతో తీసుకొన్న క్రెడిట్ కార్డుతో రూ. 1.04 లక్షలు కొల్లగొట్టాడు.ఈ నాలుగు ముఠాల సభ్యులు రూ. 2.39 కోట్లు కొల్లగొట్టారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు.