వారికి రేషన్ నగదు కట్..ఏపీ మంత్రులు సంచలన ప్రతిపాదన..?వైసీపీ ఓట్బ్యాంక్పై ఎఫెక్ట్..?
కరోనావైరస్ ఇటు జీవనంపై అటు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద వేటు వేసింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. లాక్డౌన్ విధించడం ఆంక్షలు అమల్లోకి రావడంతో ఆర్థికంగా దేశం కృంగిపోయింది. ఇక దాదాపు 40 రోజుల తర్వాత లాక్డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రకటనతో మాత్రం పండగ చేసుకుంది మద్యం ప్రియులు కావడం విశేషం. దేశవ్యాప్తంగా లిక్కర్ దుకాణాలు తెరుచుకోవడంతో లిక్కర్ లవర్స్ సోమవారం ఉదయం వైన్ షాపుల ముందు బారులు తీరారు. పూజలు పునస్కారాలు చేశారు. బాణా సంచ పేల్చారు. వారి ఆనందం చూస్తే అంతా ఇంతా కాదు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని తెలిసినా బహుశా అంత పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపించవేమో కానీ... కిక్కిచ్చే మందు అమ్ముతున్నారని తెలియగానే ఎర్రటి ఎండలో గంటల పాటు నిలబడి మద్యం బాటిల్ అందుకోగానే ఒక టోర్నమెంట్ గెలిచినట్లుగా ఫీలయ్యారు.
సోషల్ మీడియాలో కొత్త చర్చ ప్రారంభం
కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడం ఆ తర్వాత లాక్డౌన్ మే 17వరకు పొడిగిస్తూ కేంద్రం ప్రకటన చేయడం అదే సమయంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో వైన్ షాపుల ముందు పండగవాతావరణం నెలకొంది. మందుబాబులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పటాసులు పేల్చి వారు సంబురాలు జరిపారు. ఇక మద్యం ధరలు పెంచినప్పటికీ లిక్కర్ లవర్స్ అవేమీ లెక్క చేయకుండా ఎంత ధరైనా సరే కొనే అక్కడి నుంచి వెళ్లారు. అయితే సోమవారం రోజున ఏ సోషల్ మీడియా చూసినా ఒక్క మందుబాబుల గోలే తప్ప ఇతర వార్తలు లేదా వీడియోలు కనిపించలేదు. అయితే మందుబాబుల ఉత్సాహాన్ని వీడియోల ద్వారా చూసిన నెటిజెన్లు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ వాదనకు కొందరు ప్రముఖలు కూడా సై అంటున్నారు.
అలాంటి వారికి రేషన్ కట్ చేయండన్న నెటిజెన్లు
లాక్డౌన్ తర్వాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు కనీస నిబంధనలు పాటించకుండా క్యూలైన్లలో నిల్చున్నారు. ఇలా చేయడం మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందనే ఆందోళనను నెటిజెన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్యం ధరలు ప్రభుత్వాలు పెంచినా కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారంటే వారికి డబ్బులు బాగానే ఉన్నాయని భావించాల్సి ఉంటుందని అలాంటి వారికి ఉచిత రేషన్ ప్రభుత్వాలు ఇవ్వకూడదని నెటిజెన్లు డిమాండ్ చేశారు. అంతేకాదు లిక్కర్ కొనుగోలు చేసేవారి చేతిపై ఎన్నికల సమయంలో ఎలా అయితే సిరా గుర్తు వేస్తారో.. అలానే మందుబాబుల చేతులపై కూడా గుర్తువేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి గుర్తు ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ ఇవ్వరాదని నెటిజెన్లు సూచిస్తున్నారు. కాపురాలను కూల్చే మద్యం కొనుగోలు చేసే డబ్బులు ఉన్నప్పుడు ఉచిత పథకాలు ఎందుకివ్వాలంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు..? మంత్రుల ప్రతిపాదన?
ఇదిలా ఉంటే సోమవారం మందుబాబుల రద్దీని ఏపీ ప్రభుత్వం గమనించింది. ఎవరూ సామాజిక దూరం పాటించడం లేదన్న నివేదిక రావడంతో సీరియస్గా రియాక్ట్ అవుతోంది. తాజాగా మంగళవారం రోజున మరో 50శాతం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అదే సమయంలో ఈ రద్దీని నియంత్రించడం సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్లో మద్యం విక్రయాలు చేపడదామని ఏపీ సీఎం జగన్కు చెబుతానని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఇలా చేయకపోతే సామాజిక దూరం సమస్య ఎదురవుతుందని మంత్రి చెప్పారు. సోమవారం రోజున మద్యం దుకాణాల ముందు ఎక్కడే కానీ సామాజిక దూరం పాటించలేదనే నివేదిక వచ్చినట్లు మంత్రి అవంతి తెలిపారు. ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు చేపడితే వైరస్ బారిన పడే అవకాశం ఉండదని చెప్పారు.
ఓట్ బ్యాంక్పై ఎఫెక్ట్
మద్యం కోసం ఆ స్థాయిలో బారులు తీరడం సామాజిక దూరాన్ని విస్మరించడం ధరలు పెంచినా అమ్మకాలు తగ్గకపోవడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో అమ్మకాల ద్వారా ఆదాయం పెరుగుతుందన్న ఆశఉన్నా ప్రతిపక్షాల విమర్శలు మహిళల్లో ఇమేజ్ దెబ్బతింటుందన్న భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. కరోనా కష్టకాలంలోను జీరో వడ్డీ రుణాలు జగనన్న విద్యా దీవెన వంటి పథకాల అమలు ద్వారా ఇమేజ్ పెరుగుతుందనుకుంటున్న సమయంలో ఒక్కరోజు మద్యం అమ్మకాలు కొత్త సమస్యలు సృష్టించాయి. అయితే నెటిజెన్లు కోరుతున్నట్లుగా నగదు సాయం నిలిపివేస్తే ఓట్ బ్యాంక్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు ఆదాయం పెంపుతో పాటుగా విమర్శలకు అవకాశం లేకుండా చేయటం కోసం ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.