దూసుకొస్తున్న అసని తుఫాను - ఈ జిల్లాల్లో హై అలర్ట్ : భారీ వర్షాలు మొదలు..!!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో..పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మచిలీపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. యానాం, కాకినాడ మీదుగా తుపాను పయనించే సూచన కనిపిస్తోంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుందని అంచనా వేస్తున్నారు.

ఏపీలో ఆరు జిల్లాలపై ప్రభావం
తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలు ఉన్నాయని అధికారులు చెప్పారు. తుపాను దృష్ట్యా తీర ప్రాంతాల్లో 95-105 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. ముందస్తు సహాయక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం..జిల్లా అధికారులు అప్రమత్తం చేసింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగుతోంది. మండల, గ్రామ స్థాయిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేసారు. రెవెన్యూ శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
తుపాను దృష్ట్యా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లులోతట్టు ప్రాంతాల్లో తుపాను సమాచారాన్ని మైకుల ద్వారా తెలియజేస్తున్నారు. విశాఖ కలెక్టరేట్ తో పాటుగా జీవీఎంసీ కార్యాలయంలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసారు. విశాఖ నగరంలో భారీ వర్షం గురించింది. విశాఖ కోస్ట్గార్డ్ పరిధిలో నౌకలు, సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. కోనసీమ జిల్లావ్యాప్తంగా భీకర గాలులు, వర్షాలు కొనసాగుతున్నాయి. అంతర్వేది, ఓడలరేవు, కాట్రేనికోన తీరాలపై తీవ్ర తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల పరిధిలో కంట్రోల్ రూమ్ లు నిర్వహిస్తున్నారు.

సహాయ సిబ్బంది సమాయత్తం
బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.












Click it and Unblock the Notifications