Cyclone Gulab: ఏపీకి పొంచివున్న పెనుముప్పు: తీరం దాటేదీ అక్కడే..అప్పుడే
విశాఖపట్నం: కొద్దిరోజులుగా వరుసగా కురిసిన భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు, కాలువలు పొంగిపొర్లాయి. కృష్ణానది మీద నిర్మించిన శ్రీశైలం సహా పులిచింతల, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీదీ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి- ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలను చవి చూడవచ్చు. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది.
గులాబ్ తుఫాన్..
దీనికి కారణం- బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్. బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకుంది. వచ్చే 12 గంటల్లోలగా తుఫాన్గా మారనుంది. దీనికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ తుఫాన్కు (Cyclone Gulab) అని పేరు పెట్టారు. ఒడిశాలోని గోపాల్పూర్కు తూర్పు-ఆగ్నేయ దిశగా 510 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది.
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో..
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా ఉత్తర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలోని కేంద్రపారా, జగత్సింగ్పూర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా, పూరీ, గంజాం, గజపతి, కొంధమాల్, రాయగడ, నవరంగ్పూర్, జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు.
200 నుంచి
గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈదురుగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదదని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో 200 నుంచి 300 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని అంటున్నారు. ఆది, సోమ వారాల్లో ఏపీ, ఒడిశాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు, ఛత్తీస్గఢ్పైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
Recommended Video
పశ్చిమ బెంగాల్ కూడా అలర్ట్..
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫాన్గా మారనుంది. వాటి ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ భారీ వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. గులాబ్ తుఫాన్ పొంచివున్న నేపథ్యంలో- పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications