AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

అల్పపీడనం.. బంగాళాఖాతంలో అలజడి
నవంబర్ 30 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 2 నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అలజడి ఏర్పడుతుందని మేము అంచనా వేసాము. అల్పపీడనం ఏర్పడిన తర్వాత, తుఫాను ఏర్పడుతుందని అంచనా వేయగలమని మహాపాత్ర చెప్పారు.

ఏపీకి జవాద్ తుఫాను ముప్పు.. 90 కి.మీ వేగంతో గాలులు
డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అయితే దక్షిణ ఆంధ్రను తప్పించుకోవచ్చని ఆయన అన్నారు. తుఫాన్గా మారితే దానికి జవాద్ అని పేరు పెట్టనున్నారు. సముద్ర పరిస్థితులు చాలా కరుకుగా ఉంటాయి. సముద్రంలో అలలు ఎగసిపడతాయని, అదే సమయంలో గాలుల వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. గాలి వేగం గంటకు 60 నుండి 70 కిమీ ఉంటుంది; మరియు కొన్ని చోట్ల గాలులు కూడా 80 నుండి 90 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
Recommended Video

ఏపీలోని ఆ జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు
మరోవైపు, అండమాన్ తీరంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. దీంతో సోమవారం చిత్తూరు, కడప, అనంతరపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణ కోస్తా జిల్లాలో పలు చోట్ల సాధారణ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక దక్షిణాంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాలోని స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే రెండు రోజుల్లో ఈ వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల నుంచి తేరుకోని రైతులు, ప్రజలకు తాజా భారీ వర్షాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications