అతి తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం: చెన్నై టు నెల్లూరు భారీ వర్షాలు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరానికి దూసుకొస్తోంది. ఈ తుఫాను రేపు (సోమవారం) చెన్నై - శ్రీహరి కోటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరానికి దూసుకొస్తోంది. ఈ తుఫాను రేపు (సోమవారం) చెన్నై - శ్రీహరి కోటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో నాలుగు గంటల్లో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 20 సెం.మీ.ల వర్షం పడనుంది.
గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ప్రధానంగా గూడురు, నాయుడుపేట ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ముత్యాల రాజు చెప్పారు.
కాగా, శనివారం పెను తుపానుగా మారిన వార్దా ఆదివారం బలహీనపడి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది సోమవారం సాయంత్రం తీరం దాటే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇది చెన్నైకి 480 కి.మీ దూరంలో, నెల్లూరు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ దూరంలో కేందీకృతమై ఉంది.
వార్దా గంటకు దాదాపు పదకొండు కి.మీ. వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.