ముంచుకొస్తున్న తుపాన్ 'దిత్వా'- ఈదురు గాలులు, భారీ వర్షాలు.. తాజా హెచ్చరిక..!!
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ ఏర్పడింది. దీనికి దిత్వాగా నామకరణం చేసారు. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు.. భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది.
ఏపీకి మరో తుఫాను గండం పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో వాయుగుండం నైరుతి బంగాళా ఖాతం తమిళనాడు ప్రాంతాల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లో 24 గంటల్లో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.

ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, యానాంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశము ఉందని పేర్కొంది. నేడు (గురువారం) తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో గరిష్ఠంగా 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇక.. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది.












Click it and Unblock the Notifications