CYCLONE GULAB : పలు జిల్లాల్లో భారీ వర్షాలు- పునారావాస కేంద్రాలు : పలు రైళ్ల రద్దు- ప్రభుత్వ అప్రమత్తం..!!
గులాబ్ తుఫాను తీవ్రం దాటటంతో ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురూస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్రను వణికించిన గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 75 నుంచి 85 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీరం దాటాక ఆరు గంటల్లో తుపాను క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి.
తీరం దాటింది..తీవ్రత తగ్గింది
ముఖ్యంగా సిక్కోలు జిల్లా చిగురుటాకులా కంపించింది. తుపాను తీరం దాటాక.. విశాఖపట్నం నగరంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తుపాను పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్లతో ఆయన మాట్లాడారు. గులాబ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విపత్తు సహాయ దళాలను మోహరించారు. కమిషనర్ కన్నబాబు పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాను వణికించిన గులాబ్ ఆఖరులో శాంతించింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి 8.30 నుంచి 10.30 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 37.3 మి.మీ, విజయనగరం జిల్లాలో 26.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 148.5 మి.మీ, ఎచ్చెర్లలో 109.5, అడవివరంలో 108, నిమ్మాడలో 96.5, తులుగులో 96.5, విశాఖ నగరంలో 93.3, నరసన్నపేటలో 78.3, రాగోలులో 77, తమ్మినాయుడుపేటలో 71.8, పొలాకిలో 71 మి.మీ వర్షం కురిసింది. ఇక, రాత్రి నుంచి రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం
విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో 38 పునరావాస కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించారు. బందరువానిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 500 మందికి పునరావాసం కల్పించారు. వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పునరావాస శిబిరాల ఏర్పాటు
మంచినీళ్లపేటలో 12 మందిని, బైపల్లి గ్రామంలో 54 మందిని, ఎల్డీపేటకు చెందిన 26 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెట్టూరుకు చెందిన 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పించారు. పూడిలంకలో 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది.
పలు రైళ్ల రద్దు - దారి మళ్లింపు
భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్- తిరుపతి, పూరీ-చెన్నై సెంట్రల్, సంబల్పూర్-హెచ్ఎస్ నాందేడ్, రాయగూడ-గుంటూరు, భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లతో పాటు మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయనగరం జిల్లాలోనూ ఆదివారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది.
ప్రభుత్వం అప్రమత్తం- సహాయక శిబిరాలు
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇచ్ఛాపురం, మందస, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం తదితర మండలాల్లో కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్తు తీగలపై పడటంతో వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళితో పాటు మరో నాలుగు మండలాల్లో మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 తుపాను ప్రభావిత మండలాల్లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ తెలిపారు.
Recommended Video
సహాయక చర్యల్లో అధికారులు-ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
38 కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించి, వారికి భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 'గులాబ్' తుపాను బాధితులకు సహాయక చర్యలు చేపట్టేందుకు భారత నౌకాదళం సన్నద్ధతతో ఉందని తూర్పునౌకాదళ వర్గాలు తెలిపాయి. నౌకల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేసేందుకు, అత్యవసర సహాయక బృందాలను తరలించేందుకు ఎయిర్క్రాఫ్ట్లను అందుబాటులో ఉంచామన్నాయి.