బాబు కోసం వెంకయ్య! అమరావతికి టాటా సహకారం: ప్రపంచం గుర్తిస్తుందని సీఎం
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. ఆయన మంగళవారం నాడు సైరస్తో వెంకయ్య భేటీ అయ్యారు.
స్మార్ట్ సిటీ కార్యక్రమం, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ నూతన రాజధాని అమరావతితో పాటు హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు.
వాటితో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలకు సహకారం అందించాలని కోరారు. వెంకయ్య విజ్ఞప్తికి సైరస్ మిస్త్రీ సానుకూలంగా స్పందించారు. అవసరమైన సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.
అమరావతి గురించి ప్రపంచమే చర్చిస్తుంది: బాబు
అమరావతి గురించి ప్రపంచమంతటా చర్చ జరిగే సమయం ఎంతో దూరంలో లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుందర స్వప్నమైన రాజధాని నగర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.
డ్వాక్రా మహిళా సంఘాలతో బందర్ రోడ్డులో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రపంచస్థాయి నగరాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. అభివద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.
వచ్చే నాలుగేళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు డ్వాక్రా మహిళలు కృషి చేయాలని కోరారు. ఎవ్వరూ ఊహించని విధంగా నదుల అనుసంధాన్ని తాము సాకారం చేశామన్నారు. ఏపీలో రూ.150కే ఇంటింటికీ ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు.
నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచం ముందుకుకెళ్దామని డ్వాక్రా సంఘాల సభ్యులకు సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. సలహాలకు అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు తమ నైపుణ్యాన్ని పెంచుకొని వ్యాపారాల్లో రాణించాలన్నారు.
80 లక్షల మంది డ్వాక్రా సభ్యులు పట్టుదలతో పని చేస్తే టాటా, బిర్లా, రిలయన్స్ వంటి సంస్థల కంటే మెరుగ్గా వ్యాపారం చేయగలరన్నారు. ప్రతి నగరంలోనూ డ్వాక్రా సంఘాల ఉత్పత్తులతో డ్వాక్రా బజారు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేస్తే ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముడుపోతాయని, ప్రతి సభ్యురాలు నైపుణ్యాన్ని, సాంకేతికతను, కంప్యూటర్ అక్షరాస్యతను పెంచుకోవాలని ఉద్బోధించారు. ప్రతి మహిళ నెలకు రూ. 10-15 వేల ఆదాయాన్ని ఆర్జించిననాడు పేదరికం లేని రాష్ట్రం సాధ్యమని, తాము అండగా ఉంటామన్నారు.