ఆ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి
AP elections 2024: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తోంది.
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

తెలుగుదేశం- జనసేన పొత్తుపై భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలిగా చంద్రబాబు సమీప బంధువు దగ్గుబాటి పురంధేశ్వరి ఉండటమే దీనికి కారణం అనేది తెలిసిన విషయమే. టీడీపీపై గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై గానీ ఈగ వాలనివ్వట్లేదనే పేరు పురంధేశ్వరికి ఉంది. గతంలో విజయసాయిరెడ్డి వంటి వైసీపీ నేతలు చేసిన విమర్శలు దీనికి ఉదాహరణ.
ఈ పరిస్థితుల్లో తన కొడుకు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ను రాజకీయ అరంగేట్రం చేయించడానికి పురంధేశ్వరి కసరత్తు చేస్తోన్నట్లు చెబుతున్నారు. బాపట్ల జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హితేష్ను బరిలోకి దించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోంది. టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనూ తన సీటును నిలబెట్టుకోగలిగారాయన. 1,647 ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించారు.
2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదని చెబుతున్నారు. హితేష్ చెంచురామ్ కోసం ఏలూరి సాంబశివరావును చంద్రబాబు ఎన్నికల రేసు నుంచి తప్పిస్తారనే ప్రచారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. లేదా సాంబశివరావుకు చీరాలకు పంపించే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చెంచురామ్ను పోటీ చేయించేలా దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పటికే ఆయా పార్టీలతో మంతనాలు సాగించారని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉండటం వల్ల అదే కులానికి చెందిన హితేష్ చెంచురామ్ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టగలిగితే సులువుగా గెలుస్తారని పురంధేశ్వరి నమ్ముతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications