మావాళ్లు వద్దంటారు.. కానీ సాక్షినే ముందుగా చదువుతా: అయ్యన్నపాత్రుడు
'మావాళ్లంతా నన్ను ఆంధ్రజ్యోతి, ఈనాడు చదవమంటారు. సాక్షిని చదవద్దు అని చెప్తుంటారు. కానీ నేను ముందు చదివే పత్రిక మాత్రం సాక్షినే' అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
విశాఖపట్నం: రాజకీయాలను ప్రమోట్ చేసుకోవడానికో.. ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికో.. ఈరోజుల్లో పొలిటికల్ పార్టీలన్ని మీడియా మేనేజ్ మెంట్ కు అలవాటుపడ్డ సంగతి తెలిసిందే. ఏ పత్రిక ఏ పార్టీకి అనుకూలం.. ఏ పత్రిక ఏ పార్టీకి ప్రతికూలం అన్నది ఆయా న్యూస్ పేపర్స్ ను తిరగేసినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
ఈ విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య పత్రికా వైరం గురించి ఏపీ ప్రజానీకానికి తెలిసిందే. కాబట్టి.. టీడీపీ వాళ్లు వారి అనుకూల పత్రికలను, వైసీపీ వాళ్లు 'సాక్షి'ని ఎక్కువగా చదువుతారని జనం భావిస్తారు. అయితే టీడీపీలోను 'సాక్షి'ని చదవడానికే తొలి ప్రాధాన్యతను ఇచ్చే నాయకులు ఉన్నారంటే మీరు నమ్ముతారా!
నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. 'మా పార్టీ వాళ్లంతా నన్ను ఆంధ్రజ్యోతి, ఈనాడు చదవమంటారు. సాక్షిని చదవద్దు అని చెప్తుంటారు. కానీ నేను ముందు చదివే పత్రిక మాత్రం సాక్షినే' అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
సాక్షిలో ప్రచురించే కథనాల్లో వాస్తవాలు ఉండవచ్చు. వాస్తవ విరుద్దంగా కూడా ఉండవచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుంటే లోపాలను సవరించుకోవచ్చు.. ఒకవేళ ఆ వార్తలు అసత్యాలైతే పట్టించుకోనవసరం లేదు అని అయ్యన్నపాత్రుడు అభిప్రాయడ్డారు. అలా చాలా తప్పులను తాము సవరించుకోగలిగామని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఏయూ ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో గురువారం నాడు ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా డైరీని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఆ సందర్బంగా.. సాక్షి పత్రికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు పత్రికలు చదవాలని, సమగ్ర కథనాలు, విశ్లేషణలు తెలుసుకోవాలంటే దినపత్రికలే కీలకమని అన్నారు.