ఎన్టీఆర్, ఎఎన్నార్ సైతం: పులివెందులపై పవన్ కల్యాణ్ కామెంట్స్కు మహేష్ కత్తి కౌంటర్ అటాక్
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం ఉధృతమౌతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి. అందుబాటులోో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు భారతీయ జనతాపార్టీ-జనసేన కూటమి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. త్రిముఖ పోటీ నెలకొనడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తిరుపతి బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పులివెందుల గూండాలకు ఎంతకాలం భయపడతామని, వారి దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటూ పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు.
పులివెందుల పేరు ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారని ప్రశ్నించారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపిడీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని మండిపడ్డారు. అక్కడ మానవ హక్కులు కాలరాసిపోతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గుండాలకు భయపడే వ్యక్తిని కాదంటూ అన్నారు. చొక్కాలు పట్టుకొని లాగుతామంటూ ఆయన హెచ్చరించారు.
బీఎన్ రెడ్డి.. నాగిరెడ్డి
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మహేష్ కత్తి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. పులివెందుల అంటే పవన్ కల్యాణ్కు రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు గుర్తొస్తే.. తనకు మాత్రం మహానటులు ఎన్టీ రామారాావు, అక్కినేని నాగేశ్వర రావులకు సినీ భిక్ష పెట్టిన బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి గుర్తుకు వస్తున్నారని చెప్పారు.
ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడికి కూడా పులివెందుల అంటే వాళ్లిద్దరే గుర్తుకువస్తారని అన్నారు. అందుకే తెలుగుదేశం పేరుతో ఓ ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారని చెప్పారు.
ఉట్టికీ.. ఆకాశానికీ మధ్య..
పవన్ కల్యాణ్ ఉట్టికి, ఆకాశానికీ మధ్య ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. అది ఆయన కర్మ,ఖర్మ రెండూను అంటూ ఎద్దేవా చేశారు. మాదిగ సామాజిక వర్గం పట్ల చిత్తూరు జిల్లాలో రాజకీయ వివక్ష ఉందని మహేష్ కత్తి అన్నారు. అన్ని రాజకీయపార్టీలూ, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే బీజేపీకి కొంత లాభం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లలో కూడా మాదిగలు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం కోఆప్షన్ సభ్యులుగా ఒక్కొక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎంపిక చేస్తే.. డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని అన్నారు.