మిస్టర్ పవన్ కళ్యాణ్...మీకు సిఎం సీటు దక్కదు:టిడిపి దళిత నేతలు
Recommended Video

తూర్పు గోదావరి:పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టిడిపి ఆధ్వర్యంలో దళిత, గిరిజన కవాతు జరిగింది.
ఈ సందర్భంగా దళిత మంత్రులు జవహర్, నక్కా ఆనంద్బాబు మాట్లాడుతూ... ''మిస్టర్ పవన్కల్యాణ్...సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు...సీఎం కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం పొందాలి...వారి ప్రేమాభిమానాలను అందుకోవాలి...అది మీ వల్ల కాదు...అన్న ఎన్టీఆర్కే అది సాధ్యమైంది. మీకు సీఎం సీటు దక్కదు"...అని జోస్యం చెప్పారు.

టిడిపి ఆధ్వర్యంలో...దళిత కవాతు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్ 9లో పెట్టాలని, అనంతరం ఆ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దళిత, గిరిజన కవాతు జరిగింది. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వరకూ ఈ కవాతు నిర్వహించారు. ఈ కవాతులో టిడిపికి చెందిన దళిత మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జగన్ పై...ధ్వజం
అనంతరం జరిగిన సభలో దళిత మంత్రులు జవహర్, నక్కా ఆనంద్బాబు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రసంగించి పవన్,జగన్, కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నా ప్రతిపక్ష నేత జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. వైసిపి అధినేత జగన్ సుప్రీంకోర్టు తీర్పుపై ఎందుకు మాట్లాడటంలేదని వారు ప్రశ్నించారు. ప్రధాని మోడీకి ఎదురుతిరిగితే జైలు తప్పదనే భయంతోనే, జగన్ దళితులకు అన్యాయం చేస్తున్నారని టిడిపి నేతలు ధ్వజమెత్తారు.

దళితులపై...దాడులు
సుప్రీం తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధానమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సగటున రోజుకి ఆరుగురు దళిత మహిళలపై అత్యాచారం, ప్రతి 15 నిమిషాలకు ఒక దాడి జరుగుతున్నాయని...అటువంటి పరిస్థితుల్లో దళిత, గిరిజనులకు రక్షణగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా హస్తం కచ్చితంగా ఉందని వారు ఆరోపించారు.

చంద్రబాబుదే...గెలుపు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రక్షించుకోవడానికి జరిగిన ఉద్యమంపై కాల్పులు జరిపి, 12 మంది దళితులను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని యథాతధంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటంలో చంద్రబాబుదే గెలుపని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. ఎపికి ప్రత్యేకహోదా, విభజన హామీలు, రైల్వే జోన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఆర్డినెన్స్ వీటన్నింటిని సీఎం చంద్రబాబు నాయకత్వంలో సాధించి తీరుతామని కారెం శివాజీ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications