చంద్రబాబుకు మద్దతుగా రాజీనామాలు-తాజాగా జగన్ సొంత జిల్లాలో మహిళా ఉద్యోగి
ఏపీ అసెంబ్లీ చోటు చేసుకున్న దారుణ ఘటనల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉద్యోగుల్లో మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుకు సంఘీభావంగా ఉద్యోగులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గతంలో ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇలాంటి ఘటనలు కనిపించగా.. తాజాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే కోవలో సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఓ దళిత మహిళా ఉద్యోగి తన ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దుద్యాల అనితా దీప్తి .. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత చంద్రబాబుకు జరిగిన అవమానంపై కలత చెంది ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులకు తన రాజీనామా పత్రాన్ని పంపుతున్నట్లు ఆమె వెల్లడించారు.

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామానికి చెందిన దుద్యాల అనితా దీప్తి ఏడేళ్లుగా ఈ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు 40 వేల రూపాయల జీతం కూడా వస్తోంది. స్ధానిక టీడీపీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ దుద్యాల జయచంద్ర కుమార్తె అనితా దీప్తి. అయితే రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అనితా దీప్తి.. తాజాగా అసెంబ్లీ పరిణామాలపై తీవ్ర కలత చెందినట్లు కనిపిస్తున్నారు. దీంతో ఆమె ఇంకా సుదీర్ఘ పదవీకాలం ఉన్న ఉద్యోగాన్ని సైతం వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. స్ధానికంగా ఎన్టీఆర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించి తన రాజీనామాను ఉన్నతాధికారులకు పంపేందుకు ఆమె సిద్ధమయ్యారు.
అయితే రాష్ట్రంలో గతంలో ఇలాగే పలు సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్వేగాలకు గురై తమ పదవులకు రాజీనామాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ సైతం తన డీఐజీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారు. అనంతర కాలంలో ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్ రాజీనామా చేసిన క్రమంలోనే ఇప్పుడు మెప్మా దళిత మహిళా ఉద్యోగి రాజీనామా కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications