కిరణ్! ఎక్కనుండొచ్చావ్, సీమాంధ్ర వచ్చేదా?: దామోదర
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మూలాలను మర్చిపోవద్దని, ఆయన ఎక్కడి నుండి వచ్చారో గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం పలువురు తెలంగాణ ప్రాంత నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 సంవత్సరం తెలంగాణ ప్రజలకు చారిత్రకమైనదన్నారు. త్వరలో తెలంగాణ కల సాకారం కాబోతుందన్నారు. పక్షం రోజుల్లో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఈ రోజుతో చర్చ ముగిసిందని, తిరిగి రాష్ట్రపతికి పంపించామన్నారు. బిల్లు పైన రాష్ట్రపతి మొదట ఆరువారాలు, ఆ తర్వాత మరోవారం గడువు ఇచ్చినా సీమాంధ్ర నాయకులు ఉపయోగించుకోలేదని అభిప్రాయపడ్డారు. ఈ నలభై అయిదు రోజులుగా ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకులు ప్రజలను ఏ రకంగా మభ్య పెట్టాలనే చూశారని ఆరోపించారు. వారు రాజకీయ లబ్ధి కోసమే చూశారు తప్పితే తమ ప్రాంతానికి ఏం కావాలో అడగలేదన్నారు.
నాయకుడు అనే వాడు ఓ ప్రాంతానికి అనుకూలంగా ఉండవద్దని, కిరణ్ సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని, అది సరికాదన్నారు. బిల్లు రాదని, అడ్డుకుంటామని, పార్లమెంటుకు పోదని, మరింత గడువును కోరుతామని, చివరి బంతి ఉందని కిరణ్ నాటకాలు ఆడారని, కిరణ్ మంచి బ్యాట్సుమెన్ అని ప్రగల్భాలు పలిగిన నాయకులు ఇప్పటికీ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా ద్వారా లీకులు ఇప్పించుకుంటూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
మూజువాణి ఓటు ద్వారా బిల్లును అడ్డుకున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రెండు ప్రాంతాల కలయిక, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అధికారాలు పూర్తిగా పార్లమెంటువే అన్నారు. అసెంబ్లీ నిర్ణయమే అంతిమ నిర్ణయమైతే మద్రాసు పాలన నుండి సీమాంధ్ర ఏర్పడక పోయి ఉండేదన్నారు. తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ తమిళ పాలన నుండి అప్పుడు సీమాంధ్ర ఏర్పడిందని, ఇప్పుడు సీమాంధ్ర నుండి తెలంగాణ ఏర్పడుతోందన్నారు.
కేంద్రం సరైన దిశలో నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి శాసన సభ ప్రక్రియ ముగిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చరిత్రహీనుడిలా చరిత్ర తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం త్యాగాలతో కూడినదన్నారు. పోలీసుల తూటాలకు తెలంగాణ వాదులు బలయ్యారని చెప్పారు. భాష ఒక్కటైనా యాస, సంస్కృతి, సంప్రదాయం వేరు అనే విషయం తెలుసుకోవాలన్నారు.
తెలంగాణది బతుకమ్మ పండుగ అయితే, సీమాంధ్రులది సంక్రాంతి, కోడిపుంజుల కొట్లాట అన్నారు. కిరణ్! అసలు మీ రాజధాని ఏదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడక ముందే హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రమని, ఇండియన్ యూనియన్లో భాగమని చెప్పారు. మెజార్టీ సభ్యులు చెప్పినట్లే నడవాలంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక పోయి ఉండేదన్నారు. విభజనపై స్పష్టమైన చరిత్ర ఉన్నప్పటికీ కిరణ్, సీమాంధ్ర నాయకులు అందర్నీ వెర్రివాళ్లను చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ వస్తుందని తెలిసినా ఒక్క సీమాంధ్ర నాయకుడు కూడా అక్కడి సమస్యలు, వారికి కావాల్సివేమిటో చెప్పలేదన్నారు. రాజకీయ ఆరాటం తప్ప వారికి వారి ప్రాంతం పట్టలేదన్నారు. 2014 ఎన్నికల దృష్ట్యా వారు అలా ప్రవర్తించారన్నారు. రాబోయే పక్షం రోజుల్లో తెలంగాణ ఏర్పడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ తనను గుర్తించి టిక్కెట్ ఇచ్చిందని, పార్టీ లేకుంటే తాను ఎక్కడ ఉండేవాడినో అన్నారు. కిరణ్ కూడా అంతేనని చెప్పారు. కిరణ్ తన మూలాలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఓ ప్రాంతానికి ప్రతినిధిగా, మరో ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కిరణ్ రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఓ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడే నైతికత లేదన్నారు. అవ్వా కావాలి.. బువ్వా కావాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. 2004తో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎందుకు అడగలేదన్నారు.