చరిత్ర తెలుసుకో, జర జాగ్రత్త: జగన్పై దామోదర
న్యూఢిల్లీ: కాంగ్రెసుకు మరో వందేళ్ల పాటు పుట్టగతులు లేకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేత దామోదర రాజనర్సింహ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసును భూస్థాపితం చేయాలంటున్న జగన్ ఎవరి దయాదాక్షిణ్యాల మీద తన కుటుంబం ఈ స్థాయికి ఎదిగిందో తెలుసుకోవాలని, జగన్ చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
విభజన సక్రమంగా జరగలేదని జగన్ అనడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మరోసారి చదవాలని ఆయన సూచించారు. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చారన, 2009లో రోశయ్య నేతృత్వంలో ఓ కమిటీ వేశారని, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో ప్రకటించారని ఆయన వివరించారు.

చరిత్ర మరిచి మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని దామోదర జగన్ను ఉద్దేశించి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రజలు అంతా గమనిస్తున్నారని గుర్తెరగాలని దామోదర వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు నేతలమంతా కలిసి ఒక లక్ష్యంతో పనిచేసి తెలంగాణ సాధించుకున్నామని ఆయన అన్నారు. తమ సంగతి అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఇరు ప్రాంతాల్లోనూ తగిన మెజారిటీ ఉందని, తప్పకుండా కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆయన చెప్పారు. తాము ప్రాంతాలవారీగా విడిపోయినా ఒక పార్టీకి చెందినవారిమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చెందినవాడైనా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications