బటన్ నొక్కితే పెరిగేది జగన్ గ్రాఫ్-ఎమ్మెల్యేలది కాదు-వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ అజెండాతో ముందుకెళుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ ప్రతీ సంక్షేమ పథకానికి తన క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు. కరోనాలో ఈ విధానం బాగానే ఉపయోగపడినా, ఆ తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఒకటీ అరా సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ బటన్ నొక్కితే సీఎం గ్రాఫ్ పెరుగుతుంది తప్ప ఎమ్మెల్యేలది కాదని దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వెయ్యాలని ఆయన సూచించారు. వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవాలని కూడా వేణుగోపాల్ కోరారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానని దర్శి ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో పనులు చేసిన కార్యకర్తలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లులను మంజూరు చేయించాలని దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బయటికి బాగున్నంతగా కార్యకర్తల జీవితాలు లోపల బాగా లేవన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా గడపగడపకు వెళ్తే సమస్యలపై అడుగుతున్నారని వేణుగోపాల్ తెలిపారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. దీంతో ఇప్పుడు దర్శి ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.












Click it and Unblock the Notifications