Maddisetty Venugopal : పార్టీ మార్పు పుకార్లు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ ఇదే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే పుకార్లు పెరుగుతున్నాయి.
దర్శి : ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలు మారిపోతున్నారు. ఇదే క్రమంలో అధికార వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారంటూ పలు చోట్ల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు మీడియా ముందుకు వచ్చి వీటిపై స్పష్టత ఇస్తున్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో తొలిసారి ఎమ్మెల్యే అయిన మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలోకి వెళ్లబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో సీఎం జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు విడుదల చేస్తుంటే ఇక తమ పరిస్ధితి ఏంటని ఆయన వేసిన ప్రశ్న తర్వాత ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆయన స్పందించకపోవడంతో ఇవి కాస్తా మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.

తాను పార్టీ మారటం లేదని ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వెల్లడించారు. తాను కొద్దిరోజులుగా తన కుమారుడు వివాహ కార్యక్రమం, కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా బిజీగా ఉన్నట్లు తెలిపారు. గత రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నానన్నారు. అంతేకానీ తాను పార్టీ మారడం లేదని కొద్దిరోజులుగా కొన్ని పత్రికలలో మీడియాలలో నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
2019 ఎలక్షన్ సమయంలో పార్టీ పెద్దలు తనతో హైదరాబాద్ లో మూడు సార్లు సమావేశం జరిపినప్పుడు అనంతరం పార్టీలో చేరానని మద్దిశెట్టి వేణుగోపాల్ వెల్లడించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నామని, తమకు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉందని ఆయనకు తనపై నమ్మకం ఉందని వేణుగోపాల్ తెలిపారు. కాబట్టి పార్టీ మారే సమస్యే లేదన్నారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు తెరపడినట్లయింది.












Click it and Unblock the Notifications