రానంటే రాను: రాజకీయాలపై దాసరికి రోత, పవన్ కల్యాణ్పై ఇలా....
హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తెర దించారు. రాజకీయాలంటే ఆయన తీవ్ర వైముఖ్యంతో ఉన్నట్లు ఆయన ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
రాజకీయాలు వ్యాపారంగా మారుతున్నాయని, ఇప్పుడు నాలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదని ఆయన అన్నారు. వచ్చినా బురద చల్లించుకోవాలని దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
వైయస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధం అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. 1978లో వాళ్లు రాజ్-యువరాజ్ అనే థియేటర్లను కట్టినప్పుడు యువరాజ్ను నేను ప్రారంభించానని, అప్పటి నుంచి తమ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు.
ఆ అనుబంధంతోనే ఇటీవల తనను జగన కలిసి ఆశీస్సులు తీసుకొన్నారని, రాజకీయాల్లోకి రమ్మని తనను అతను ఆహ్వానించలేదని చెప్పారు.సాధించాలనే తపన ఉన్న మనిషి జగన్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా ఆయన మాట్లాడారు.
ఇప్పటిదాకా హోదా ఇవ్వకపోవడం బాధాకరమని, పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ప్రకటించిన విషయం శాసనం కిందే లెక్క అని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లు పెట్టలేమనడం బాధాకరమని చెప్పారు. బిల్లులో పెట్టకపోవడం అప్పటి ప్రభుత్వం తప్పు అని చెప్పారు.
పవన్ కల్యాణ్కు కమిట్మెంట్ ఉంటుందని, మాట మీద నిలబడతాడని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నాడని, బాధ్యతలు తీసుకొనేటప్పుడు రెండు పడవల మీద ప్రయాణం సరికాదనేది తన అభిప్రాయమని తెలిపారు.