ఆ రాజకీయ బ్రోకర్ వల్ల విభజన: దాసరి, ఎవరా వ్యక్తి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం సంచలన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు కారణం ఓ రాజకీయ బ్రోకర్ అని ఆయన ఆరోపించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. విభజనకు ఓ రాజకీయ బ్రోకర్ కారణమని, దాని వెనుక ఆయన ఉన్నారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్రోకర్ ఎవరో తాను టైం తీసుకొని చెబుతానన్నారు. చేతకాని ప్రభుత్వాలు, అసమర్థ ప్రభుత్వాలు, మంత్రుల వల్లనే ఇవాళ ఈ దుస్థితి వచ్చిందని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు ఆ బ్రోకర్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఓ బ్రోకర్ కారణమని దాసరి నారాయణ రావు వ్యాఖ్యానించడంతో ఆయన వ్యాఖ్యానించిన ఆ బ్రోకర్ ఎవరు అనే చర్చ సాగుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు విభజన విషయంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
రాష్ట్ర విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ కారణమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఆరోపిస్తుండగా... టిడిపి, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడుతోంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస కుట్ర అని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
రాజకీయ పార్టీలు విభనజపై దుమ్మెత్తు పోసుకుంటున్నారు. జగన్ సూచించిన ఆర్టికల్ 3 కారణమని, చిరంజీవి సహా ఇతర కేంద్రమంత్రులు మిన్నకుండటం కారణమని, చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణమని పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.
కాగా, దాసరికి చిరుకు పడదనే విషయం తెలిసిందే. చిరంజీవి ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అదే పార్టీ ఇప్పుడు విభజన చేసింది. దీంతో చిరును ఉద్దేశించి దాసరి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సాగుతోంది. చిరును ఉద్దేశించి దాసరి పరోక్షంగా గతంలోను వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications