డేటా చోరీ: 'హైదరాబాద్, బెంగళూరు నుంచి కుట్రలు', ఆ ఓట్లు తొలగించాలని మేమే చెప్పాం.. జగన్
అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు కుట్రలో ఏ1 నిందితుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డియేనని, ఫారం 7ను దుర్వినియోగం చేశాడని, ఇది ఆ పార్టీకి సిగ్గుచేటు అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం మండిపడ్డారు. ఓట్లు గల్లంతైన వారు జగన్ను నిలదీయాలన్నారు. ఆయన టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫారం 7 దరఖాస్తులు 13 లక్షలు పంపుతారా అని వైసీపీపై విమర్శలు గుప్పించారు.
పీకే... నువ్వెవరు ఓట్లు తొలగించేందుకు, తేల్చుకుందాం రా, తోక కట్ చేస్తా: చంద్రబాబు
హైదరాబాద్, బెంగళూరు నుంచి కుట్రలు
బెంగళూరు, హైదరాబాద్ నుంచి కుట్రలు సాగాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల లిస్టులో మీ పేరు ఉందో లేదో ప్రజలంతా సరి చూసుకోవాలని సూచించారు. 2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రం పరువు పోయిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏపీలో రౌడీయిజం లేకుండా చేశామని చెప్పారు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. తప్పులు చేసేవాళ్లకు, నేరగాళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటు దక్కుతోందన్నారు.
ఆ ఓట్లు తొలగించమని మేమే చెప్పాం.. జగన్
అంతకుముందు రోజు నెల్లూరులో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఓట్ల అంశంపై స్పందించారు. దొంగ ఓట్లు తొలగించాలని తామే కోరామని, ఎక్కడికి అక్కడ ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపును అడిగామని చెప్పారు. ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి మొదలు రాష్ట్ర అధికారుల వరకూ అందరినీ కలసి విన్నవించుకున్నామని చెప్పారు. దొంగ ఓట్లను చేర్చడం, ఉన్న ఓట్లను తొలగించడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు తమకు ఓటు వేయరని భావిస్తున్న వారి ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు.
ఏపీలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు
రాష్ట్రంలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, అందులో 39 లక్షల ఓట్లు మన రాష్ట్రంలోనే ఉండగా, మరో 20 లక్షల ఓట్లు తెలంగాణకు చెందినవి ఉన్నాయని జగన్ చెప్పారు. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని, ఆయనకు ఓటు వేయరన్న వారి ఓట్లు తొలగిస్తారని, వీటిపై ఈసీకి మనం ఫిర్యాదు చేస్తే దొంగే దొంగ అని అరచినట్లు మనపై ఎదురు దాడి చేస్తారన్నారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి ఓటు కూడా తొలగించాలని అర్జీ పెట్టారన్నారు. ప్రతి నియోజకవర్గంలో వేలసంఖ్యలో ఓట్ల తొలగింపు కోసం ప్రయత్నించారని మండిపడ్డారు. కాగా, ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, అలాగే ఏపీకి చెందిన టీడీపీ, తెలంగాణలోని తెరాస నేతల మధ్య ఏపీ ఓటర్ల జాబితాపై మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.