కరెన్సీ సంక్షోభం జాతీయ విపత్తు: చంద్రబాబు, బ్యాంకర్లపై ఒత్తిడి మీద ఇలా...
ప్రస్తుత కరెన్సీ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి, సమన్వయ కృషి అవసరమని ఆయన అన్నారు.
అమరావతి: ప్రస్తుత కరెన్సీ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి, సమన్వయ కృషి అవసరమని ఆయన అన్నారు. బ్యాంకర్లపై సోమవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు మంగళవారంనాడు కరెన్సీ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు.
బ్యాంకర్ల పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తొలగించడానికి మాత్రమే తాను బ్యాంకింగ్ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు తెలిపారు.

"మీ మీద ఒత్తిడి పెడుతున్నాని మీరు అనుకోవద్దు. ప్రజలను సమస్యల నుంచి గట్టెక్కించడమే నా లక్ష్యం. దానివల్లనే మీ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకున్నాను. ప్రస్తుత కరెన్సీ సంక్షోభం జాతీయ విపత్తు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ సమస్యను పరిష్కరించాలి" అని చంద్రబాబు అన్నారు.
బ్యాంకర్లతో ఆయన మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయమూ సాయంత్రమూ సమీక్ష జరుపుతున్నప్పటికీ బ్యాంకర్లు సహకరించకపోవడంతో తాము నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోందని ఆయన సోమవారం అన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు వ్యాఖ్యలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో ఆయన వారిని చల్లబరిచేందుకే అన్నట్లుగా మంగళవారంనాడు మాట్లాడారు. రాష్ట్రంలో అందుబాటులో నగదు చాలా తక్కువగా ఉందని, సెల్ మిషన్లు కూడా తక్కువే ఉన్నాని, రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉందని, దాంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications