ఎనిమిది జిల్లాల్లో 40 డిగ్రీలకు పైమాటే.. ఇది ట్రైలర్ మాత్రమే
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అసాధారణంగా ఉంటోంది. మార్చి మూడోవారంలోనే ఎండలు మండుతున్నాయి. ఏపీలో కోస్తా తీర ప్రాంతంలో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. విజయవాడ మొదలుకుని శ్రీకాకుళం వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ట్రైలర్ మాత్రమే అనిపించేలా ఉంది. ఏప్రిల్-మే-జూన్లల్లో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు.
రాష్ట్రంలో సంక్రాంతి తరువాత నుంచే ఎండ వేడి క్రమంగా పెరుగుతూ వచ్చింది. కిందటి నెలలో పగటి ఉష్ణోగ్రత పెరిగింది. ఈ నెలలో ఎండ వేడి పతకా స్థాయికి చేరుకుంది. పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా నమోదవుతోంది. ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వరకూ వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. సముద్రం మీదుగా వీస్తోన్న బలమైన గాలులకు ఎండవేడి తోడు కావడం వల్ల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని చెప్పారు. కోస్తా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోనూ వచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.
రాయలసీమలో కర్నూలు జిల్లాలో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, కొత్తకోట-40.23, నాతవరం-40.22, మునగపాక-40.17, కశినికోట-40.14, బలిఘట్టం-40.12, మాడుగుల-40.05, గంభీరం-40.01 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు-43, రాజాం-42, పాలకొండ-41.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో కర్నూలు జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.