దారుణం: కామారెడ్డి ఆసుపత్రిలో మృతదేహాన్ని పీక్కుతిన్న పందికొక్కులు
హైదరాబాద్: సాధారణంగా మృతదేహాన్ని కుక్కులు పీక్కుతినే సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. కానీ, సభ్య సమాజం తల దించుకునేలా ఉంది ఈ సంఘటన. మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్న హృదయ విదారక సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలోని సొంతూరు మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల పండరి అనే వ్యక్తి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని గురువారం ఓ పంది ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్ల పండరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే పండరి మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పండరి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించి, పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. విషయం తెలుసుకున్న పండరీ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు.
మృతదేహాన్ని తమకు చూపించాలని డిమాండ్ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో నుంచి బయటకు తీసుకువచ్చి మృతదేహాన్ని చూపించారు. మృతదేహం ముఖ గుర్తు పట్టలేనంతగా తయారైంది. ఇదేంటని పండరి కుటుంబ సభ్యులు అడగ్గా... పంది కొక్కులు పీక్కుతిన్నాయని సిబ్బంది తెలిపారు.
దీంతో పండరి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.