మనమేనని చెప్పండి: బాబుపై ప్రశ్నల వర్షం, గడ్కరీ సంతృప్తి చెందలేదా?
Recommended Video
పోలవరం: పోలవరం ప్రాజెక్టు కేంద్ర జలవనరుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం చంద్రబాబు, గడ్కరీలు ప్రాజెక్టును పరిశీలించిన విషయం తెలిసిందే. సవరణలతో అంచనాలు పెరిగాయని, వీటిపై అనుమానాలు తీర్చారని, సేకరించాల్సిన భూమి రెండు రెట్లు పెరిగిందని, ఈ ప్రాజెక్టుపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని గడ్కరీ చెప్పారు.
క్షేత్రస్థాయిలో చూడాలని, అడిగింది ఇవ్వాలని, ముంపును బట్టి సేకరించే భూమీ పెరిగిందని, కారణాలు ఇప్పటికే చెప్పామని, మళ్లీ చెబుతామని చంద్రబాబు చెప్పారు. అసలు కేంద్రం చేయాల్సిన పనిని మేం చేస్తున్నామని సీఎం అన్నారు. అయితే ఏపీ బీజేపీ, వైసీపీ, జనసేన అదే ప్రశ్న వేస్తోంది. అసలు కేంద్రం చేయాల్సిన పనిని మీరు ఎందుకు చేస్తున్నారని, వారికే అప్పగించవచ్చుననేది వైసీపీ, జనసేన డిమాండ్.
పోలవరంపై బాబుకు కన్నా ఊహించని షాక్: గడ్కరీ సందర్శన, టీడీపీXబీజేపీ
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవాలి
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం గడ్కరీ, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు. హఠాత్తుగా నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలని చంద్రబాబును అధికారుల సమక్షంలోనే గడ్కరీ అడిగారు.
ప్రశ్న భుసేకరణ పెరగడంపై ప్రశ్న
ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకంతకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాత డీపీఆర్కు, ప్రస్తుత డీపీఆర్కు అసలు పోలిక లేదని, ఎందుకు మార్చారో కచ్చితంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. భూసేకరణను గతంలో కంటే ఎక్కువ చేశారని, పెరిగితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం పెరగాలని కానీ భూసేకరణ ఎందుకని నిలదీశారని తెలుస్తోంది. ముంపును బట్టే భూసేకరణ పెరిగిందని చంద్రబాబు చెప్పారు.
అన్ని వివరాలు ఇస్తే 8 రోజుల్లో క్లియరెన్స్
తన ప్రశ్నలపై చంద్రబాబు వివరణ ఇచ్చినా గడ్కరీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు ఉండాలని చంద్రబాబుకు సూచించారు. ప్రాజెక్టుపై అవసరమైన వివరాలు జలవనరుల శాఖకు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లో అన్ని క్లియరెన్సులు ఇచ్చి నిధుల పెంపు కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపుతానని తెలిపారు.
రైతులకు కలిగే మేలు నాకు తెలుసునని గడ్కరీ, అందుకే ప్రాధాన్యం
ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందని గడ్కరీ చెప్పారు. నిధుల గురించి బెంగ అవసరం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే మేలు తనకు తెలుసునని, అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కాగా, సవరించిన అంచనాలో ముంపునకు గురయ్యే భూమి రెట్టింపు అయింది. దీని అంచనా వ్యయమే రూ.30వేల కోట్లు పెరిగింది. పోలవరం జీవనాడి అని, దానిని రాజకీయం చేయవద్దని గడ్కరీ అన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అన్నారు.
మనమే పూర్తి చేస్తాం.. చెప్పండి
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని గడ్కరీ పార్టీ నేతలతో ఆ తర్వాత అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఆయన బీజేపీ నేతలతో అక్కడే సమావేశమయ్యారు. ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తోందని, దీనిని మనమే పూర్తి చేస్తామని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలని సూచించారు.