చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా ఢిల్లీ టూర్ - పీఎం..షా తో భేటీ డౌటే..!! సీఎం జగన్ కౌంటర్ ప్లాన్..!!
తమ పార్టీ కార్యాలయంపై దాడుల అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఏపీలోనే కాకుండా..జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం రెండు ఢిల్లీ యాత్రకు చంద్రబాబు సిద్దం అయ్యారు. 36 గంటల దీక్ష చేసిన చంద్రబాబు పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతితో పాటుగా ప్రధాని..కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లను టీడీపీ కోరింది. అందులో ఈనెల 25(సోమవారం)న మధ్యాహ్నం 12.30 కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అప్పాయింట్ మెంట్ ఖరారైంది.

ఖరారైన రాష్ట్రపతి అప్పాయింట్ మెంట్
రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరనున్నారు. మొత్తం 18 మందితో కలిసి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. వ్యవస్థలపై జరుగుతున్న దాడులు, ఆర్థిక పతనంపై రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, తొలుత దీక్ష ముగిసిన వెంటనే ఈ రోజు (శనివారం) ఢిల్లీ వెళ్లాలని భావించారు. కానీ, ఇప్పుడు సోమ..మంగళ వారం ఢిల్లీలో చంద్రబాబు తో సహా టీం సభ్యులు ఉండనున్నారు. రాష్ట్రపతి వద్దకు అయిదుగురు సభ్యులతో కలిసేందుకు అనుమతి లభించింది.

ప్రధాని..హోం మంత్రి సమయం కోసం నిరీక్షణ
ఇక, ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు ఇప్పటి వరకు ఖరారు కాలేదు. కానీ, ఢిల్లీ వెళ్లేందుకు ఇంకా రెండు రోజుల సమయం..అక్కడ రెండు రోజులు ఉండనుండటంతో అప్పాయింట్ మెంట్ లభిస్తుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. దీని కోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ షా ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం వరకు కాశ్మీర్ లోనే పర్యటించేలా షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది. దీని కారణంగానే మంగళవారం సైతం చంద్రబాబు టీం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

వారి కోసమే రెండు రోజుల పర్యటన
ప్రధాని అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించాలని..అవకాశం లభించకుంటే.. అమిత్ షా తో కలవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నేరుగా అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాజకీయాలు ఎలా ఉన్నా..ఒక రాజకీయ పార్టీ అప్పాయింట్ మెంట్ అడిగిన సమయంలో..కేంద్ర హోం మంత్రి గా ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవటం అనేది ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు ఎన్డీఏలో ఉండి..ఆ తరువాత ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా చంద్రబాబు పని చేసారు.

గత రాజకీయాల ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభావం చూపుతాయా
కాంగ్రెస్ తో జత కట్టారు. ప్రధాని పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అప్పటి నుంచి ప్రధాని మోదీ..షా తో చంద్రబాబు ప్రత్యక్షంగా కలవలేదు. ఇప్పుడు..ఢిల్లీలో వారి అప్పాయింట్ మెంట్లు తీసుకున్నట్లుగా మాత్రమే చెబుతున్న టీడీపీ నేతలు.. కలుస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రాజకీయంగా ఎవరిని కలిసినా కొత్తగా సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇ

ఆ ఇద్దరితో కలిస్తే కొత్త సమీకరణాలపై అంచనాలు
ఇదే సమయంలో వైసీపీ సైతం అలర్ట్ అయింది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం ప్రారంభించారు. టీడీపీ అధికార ప్రతినిధి సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాల పైన క్లారిటీ ఇచ్చినట్లు వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఢిల్లీ పర్యటనలో అనుకున్న విధంగా ప్రధాని..అమిత్ షా అప్పాయింట్ మెంట్లు దక్కితే..ఇక, కొత్త రాజకీయ సమీకరణాల దిశగా చంద్రబాబు వేగంగా అడుగులు వేయటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే, ఢిల్లీలో వారిద్దరి నుంచి సానుకూల స్పందన లేకుంటే.. చంద్రబాబు వ్యూహాలు ఏపీకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

కౌంటర్ ప్లాన్ తో వైసీపీ సిద్దం
దీంతో..ఇప్పుడు ఢిల్లీ టూర్ మొత్తంగా చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అక్కడ టీడీపీ నేతలకు లభించే స్పందన ఆధారంగా సీఎం జగన్ సైతం తన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు కొందరు ఢిల్లీలో మొహరించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్లాన్ కు కౌంటర్ ప్లాన్ తో వైసీపీ సిద్దం అవుతోంది. దీంతో...ఆ రెండు రోజులు ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications