20 రోజులైనా: బ్యాంకర్లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఫోన్లో జైట్లీతో 'అసహనం'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నోట్ల రద్దు ప్రకటన చేసి ఇరవై రోజులు గడిచినా ఏటీఎంలు, బ్యాంకుల ముందు నిలబడి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నా బ్యాంకర్ల సహాయ నిరాకరణ, వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబుకు ఝలక్: 'ఆ సర్వే అంతా ఊహాజనితం', సీనియర్లతో జగన్ అత్యవసర భేటీ!
రాష్ట్ర అవసరాలకు తగినట్లు చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదన్నారు. ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జమ అవుతుండగా, నగదు ఉపసంహరణ మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారన్నారు. మూడు వారాలు అయినా బ్యాంకుల దగ్గర సెంట్రల్ సర్వర్ నుంచి కచ్చితమైన సమాచార లభ్యత లేదన్నారు.
నోట్ల రద్దు: నల్లకుబేరులకు మరో ఛాన్స్, లోకసభలో ఐటీ సవరణ బిల్లు
అన్ని బ్యాంకులను సమన్వయం చేసుకోవాల్సిన ఆర్బీఐ ఈ కీలక సమయంలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. కానీ అలా జరగడం లేదన్నారు. ఇలాంటి దానిని సహించేది లేదన్నారు. రోజూ నిర్వహిస్తున్న అత్యవసర సమావేశాలకు లీడ్ బ్యాంకర్లే సక్రమంగా రావడం లేదన్నారు.
డేటా లేనప్పుడు సమీక్షలు నిర్వహించి లాభం ఏమిటని నిలదీశారు. పోస్ మిషన్ల అందుబాటు, చిన్న నోట్ల అందుబాటులో రియల్ టైం డేటా ఇవ్వడం లేదన్నారు. బ్యాంకర్ల వైఖరిలో మార్పు రాకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.
కాగా సీఎం చంద్రబాబు తన అసంతృప్తిని తనకు ఫోన్ చేసిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలిపారు. జైట్లీ.. చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల సమస్య పరిష్కరించేందుకు జైట్లీ ఫోన్ చేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి చంద్రబాబును చైర్మన్గా వ్యవహరించాలని కోరారు. అయితే, పరిస్థితి ఇలాగే ఉంటే తాను ఉండలేనని అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఈ రోజు రూ.500 నోట్లు రూ.95 కోట్లు, రూ.100 నోట్లు రూ.62 కోట్లు, రూ.2000 నోట్లు రూ.1320 కోట్లు, రూ.20 నోట్లు రూ.8 కోట్లు, రూ.10 నోట్లు రూ.2.5 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాంకర్లు తెలిపారు.
మరోవైపు, కమాండ్ కంట్రోల్ రూం నుంచి నోట్ల రద్దు పరిస్థితుల పైన చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితి పైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.