రూ.1000 కోట్లు డిపాజిట్ చేసిన విశాఖవాసులు! పెద్ద నోట్లు తీసుకోకుంటే అంతే
విశాఖ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో చాలామంది తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు వరుస కడుతున్నారు. విశాఖలోను పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు డిపాజిట్ చేశారు. నవంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు విశాఖవాసులు బ్యాంకులలో రూ.954 కోట్లు డిపాజిట్ చేశారు.
మోడీకి ఊరట, నోట్ల రద్దుపై స్టేకు సుప్రీం నో, కానీ..
ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8వ తేదీన రాత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత పదో తేదీ నుంచి డిపాజిట్లు ఊపందుకున్నాయి. ఇప్పటి దాకా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారు. అదే సమయంలో రూ.303 కోట్లను విశాఖవాసులు విత్ డ్రా చేసుకోవడం లేదా, రూ.500, రూ.1000 నోట్లతో మార్పిడి చేసుకోవడం జరిగింది.
రానున్న రోజుల్లో డిపాజిట్లు మరింత పెరుగుతాయని బ్యాంకర్లు భావిస్తున్నారు. అలాగే, ప్రజలు విత్ డ్రా చేసుకోవడం లేదా మార్పిడి చేసుకునేందుకు రూ.60 కోట్ల మేర అవసరం అవుతాయని భావిస్తున్నారు.
నోట్లు తీసుకోకుంటే..
మరోవైపు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు తదితర ప్రాంతాల్లో రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, నోట్లు తీసుకుంటున్నారా లేదా తెలుసుకునేందుకు తనిఖీల కోసం ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసారు. ఈ టీంలు హఠాత్తుగా తనిఖీలు చేస్తాయి. పెద్ద నోట్లు తీసుకోకుంటే వారి పైన క్రిమినల్ కేసులు పెడతారు.
జాతీయ, ప్రయివేటువి కలిసి విశాఖ జిల్లాలో 737 బ్యాంకులు ఉన్నాయి. అలాగే 1104 ఏటీఎంలు ఉన్నాయి. ప్రజలకు రూ.2000 నోట్లు సులభంగా దొరుకుతున్నాయి. కానీ రూ.50, రూ.100 నోట్ల పైన మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని తెలుస్తోంది.
మరో 48 గంటల తర్వాత పరిస్థితి కొంత మారవచ్చునని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ, పట్టణ.. ఇలా ఎలాంటి తేడాలు చూపించవద్దని బ్యాంకర్లను అధికారులు ఆదేశించారు.
ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విలేకరులతో చెప్పారు. బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అలాగే, ఖాతాదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.