బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం...కోస్తాలో భారీ వర్షాలు?:గోదావరికి వరదలు వచ్చే అవకాశం
విశాఖపట్నం:వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఆదివారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు మొదలుకాగా...ఆదివారం కోస్తాతో పాటు రాయలసీమలో పలుచోట్ల చెదురుమదురు వర్షాల నుంచి భారీ వర్షాల వరకు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఎగువప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా ఈనెల 27 నుంచి గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.

వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమబంగ, ఉత్తర ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం కారణంగా...దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ప్రధానంగా ఉత్తర కోస్తాలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలల ఉధృతి బాగా పెరిగింది. దీంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు తెలిపారు.
అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదని, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనాల ప్రభావం కారణంగా రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
వాయవ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం బలపడిన తరువాత ఇది భూఉపరితలంపైకి పయనించే క్రమంలో దక్షిణ ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఉత్తర తెలంగాణల్లో భారీనుంచి అతి భారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టిగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. అదే జరిగితే దీని ప్రభావంతో ఈనెల 27నుంచి గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications