యాస్ పెను తుఫాను: కోస్తాంధ్రాలో వర్షాలు, బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం
న్యూఢిల్లీ/అమరావతి: తూర్పు మధ్య బంగాళాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారుతుందని భారత వాతారణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి సోమవారం నాటికి తుఫానుగా మారే సూచనలున్నాయని తెలిపింది.
Recommended Video
మే 26న తీరాన్ని తాకనున్న తుఫాను..
ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం ఉత్తర వాయువ్యంగా కదిలి పెను తుఫానుగా మారే సూచనలున్నాయని తెలిపింది. మే 26న ఉదయం ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
యాస్ తుఫానుతో ఉత్తరాంధ్రలో వర్షాలు
ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పరిమితంగానే ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, కోస్తాంధ్రలో సోమవారం వర్షాలు పడతాయని పేర్కొంది. మే 25,26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు వర్షలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
సముద్రంలోకి వెళ్లొద్దంటూ మత్య్సకారులకు హెచ్చరిక
ఒడిశా, పశ్చిమబెంగాల్, ఏపీ మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. కాగా, తైక్టే తుఫాను గుజరాత్ తోపాటు పశ్చిమతీరంలోని రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. తాజాగా, వస్తున్న యాస్ తుఫానుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు.
యాస్ తుఫానుపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష
యాస్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్), ఇతర శాఖల ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. తుఫాను సమయంలో ముప్పు ప్రాంతాల ప్రజలతోపాటు ఇప్పటికే కరోనా చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎస్, సహా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరించే ఏర్పాట్లు చేస్తున్నాయి.