ఏసీబీ అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది: దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారు: డిప్యూటీ సీఎం ఫైర్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అవినీతి నిరోధక శాఖ అధికారుల పైన తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నిరోధించాల్సిన శాఖలో కొందరు అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మధురవాడ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టార్ ను ఇరికించబోయిన ఏసీబీ అధికారులు వారే ఆ వలలో చిక్కుకోవ టం..ఆ వ్యవహారం తన వద్దకు రావటంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి వద్దకు చేరింది.
డిప్యూటీ సీఎం సీరియస్..
విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తో పాటుగా ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన ఏసీబీ అధికారులు అడ్డంగా దొరికిపోయిన ఘటన పైన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా స్పందించారు. ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్ రిజిస్ట్రార్ టి.తారకేష్ను ఏసీబీ సీఐ గఫూర్ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు.

అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా సీసీ కేమెరాల్లో రికార్డు అయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మొత్తం వీడియోలను డిప్యూటీ సీఎం బోస్ ముందుంచారు. దీని పైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సీఎంకు డిప్యూటీ సీఎం ఫిర్యాదు
ఏసీబీ అధికారులపై డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అయ్యారు. కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికే ఈ వ్యవహారం మీద ఏసీబీ డీజీతోనూ.. హోం మంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో విచారణే అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని వివరించారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారుల మీదా అలాగే కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు.
తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి.. సస్పెండ్ చేయాలని కోరారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారంటూ మండి పడ్డారు. అదే సమయంలో విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications