మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో ఏపీకు చెందిన మధుసూదన్ రావు కూడా ఒకరు. ఆయన మృతదేహాన్ని ఈరోజు ఉదయం కావలికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా నెల్లూరు జిల్లాలోని కావలికి వెళ్లి పవన్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. అధైర్య పడొద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కావలిలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధుసూదన్ పార్ధివదేహం చూసేందుకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పర్యవేక్షిస్తుండగా.. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరి నారాయణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అంత్యక్రియలలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులు, ముఖ్య నేతలు పాల్గొంటున్నారు.

ఇక ఇప్పటికే ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అంతే కాకుండా పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి కావలి బస్టాండ్లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ముందుగా ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో సంతానంగా మధుసూదన్రావు పుట్టారు. మధుసూదన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డ ఆయన అక్కడ సొంతింటిని కూడా నిర్మించుకున్నారు. సమ్మర్ ట్రిప్ లో భాగంగా తన భార్య, కుమార్తె, కుమారుడుతో కలసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కానీ ఊహించని రీతిలో ఉగ్రవాదుల దాడిలో హతమయ్యారు.












Click it and Unblock the Notifications