అంతా ఏపీ బీజేపీ వల్లే: బాబు అసహనం, విభజనపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఏపీకి కేంద్రం చాలా నిధులు ఇచ్చిందని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పడం, మరోవైపు కేంద్రం కూడా నిధులు ఇచ్చామని, ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, పార్టీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం లెక్కలు అవి
సంప్రదింపులు జరుపుతూనే హామీలపై పోరాటం చేయాలని చంద్రబాబు, టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. హరిబాబు వంటి ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న లెక్కలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజన హామీలకు సంబంధించి లెక్కలు చెప్పాలని వారు భావిస్తున్నారు. విభజన సమయంలో కేంద్రం ఏం హామీ ఇచ్చింది, ఏం ఇచ్చిందో చెప్పాలని నిర్ణయించుకున్నారు.
ప్రత్యేకంగా ఏమిచ్చారు, ఏపీ బీజేపీ నేతలతోనే నష్టం
అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి నిధులు ఇచ్చారని, ప్రత్యేకంగా నవ్యాంధ్రకు ఏమి ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలకు లెక్కలతోనే సమాధానం చెబుదామన్నారు. ఏపీ బీజేపీ నేతలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.
విభజన, హామీలపై జస్టిస్ ఎన్వీ రమణ
రాష్ట్ర విభజనపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత ఏపీ తీవ్ర అన్యాయానికి గురయిందన్నారు. రాష్ట్రానికి అండగా నిలబడేందుకు చొరవ చూపాలన్నారు. ఏపీలో వీలైనంత త్వరగా హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. న్యాయపాలన తెలుగులోను ఉండాలని, కోర్టులో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలంటే తెలుగులోను న్యాయపాలన ఉండాలన్నారు. తాను సాధ్యమైనంతసేపు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
చంద్రబాబు కష్టపడుతున్నారు, కేంద్రం అండ
మరోవైపు, బీజేపీ, టీడీపీ ఏపీ నేతల వాగ్యుద్ధంపై మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తల గొడవల్లా ఉందన్నారు. ఇరు పార్టీల మధ్య సమస్య త్వరలో సమసిపోతుందన్నారు. యూపీఏ పాలించిన పదేళ్ల కాలంలో ఏపీని పట్టించుకోలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక నిధులు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. కేంద్రం ఆయనకు అండగా నిలబడుతోందన్నారు.