మాగుంట వర్సెస్ పీతల: చింతలపూడి పాలిటిక్స్, ఇక రాజీనామాలే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకుంటారు. కానీ వారు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకుంటారు. కానీ వారు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 వరకు కష్టపడి పనిచేసినప్పుడు తమకు మంచి పేరొచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగడం లేదని తెలుగు తమ్ముళ్లు చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై నిప్పులు చెరుగుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే - మాజీ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగుంట బాబు మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా మారాయి. ఎమ్మెల్యేపై సాక్షాత్ సొంత పార్టీ ఎంపీ వర్గీయులే బహిరంగంగా తిరుగుబాటు చేశారు.
మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరికలకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మూడేళ్లుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను లక్ష్యంగా చేస్తూ వచ్చిన ఎంపీ మాగంటి బాబు వర్గం ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి పోవడంతో నేరుగా రంగంలోకి దిగిపోయింది.

మూకుమ్మడి రాజీనామాలకు తమ్ముళ్లంతా సిద్ధం
తమ మాట నెగ్గకపోతే నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అల్టిమేటం కూడా ఇచ్చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రాకుండా పోయింది. మూడేళ్లుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గం నియామకం చేపట్టక పోవడం తెలుగు తమ్ముళ్లలో నిరాశను నింపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజాత తన వర్గీయులకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఎంపీ మాగంటి బాబుతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తమ వర్గానికే ఈ పదవి దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండు వర్గాలూ ఈ విషయమై పట్టుదలతో ఉండడంతో విభేదాలు రచ్చకెక్కాయి.
Recommended Video


ఫిరాయింపు దారులకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపాటు
పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి ఆమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు పదేపదే ఆమె నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు.

మూడేళ్లయినా నియామకం కాని చింతలపూడీ ఏఎంసీ
చింతలపూడి మార్గెట్ యార్డు చైర్మన్గా ఎవరిని నియమించాలనే దానిపై తొలి నుంచి పీతల సుజాత, మాగంటి బాబు వర్గాల మద్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లకు చైర్మన్ల నియామకం జరిగిపోయినా.. ఇంతవరకూ చింతలపూడి ఏఎంసీ నియామకం జరగలేదు. ఇటీవల పార్టీ మండల అధ్యక్ష పదవులూ తమ వర్గానికే ఇవ్వాలని ఎంపీ మాగంటి వర్గం పట్టుపడుతూ వచ్చింది. ఎమ్మెల్యే పీతల సుజాత తన వర్గం వారినే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. దీంతో ఎంపీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే విషయమై రచ్చ జరిగింది. తర్వాత అమరావతిలోనూ దీనిపై సమావేశం నిర్వహించినా ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు.

పీతల ఏకపక్ష వైఖరిని సహించబోమంటున్న తమ్ముళ్లు
తాజాగా ఎంపీ వర్గ నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలకు అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో సమావేశమై ఎమ్మెల్యే పీతల సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో కమిటీలను నాయకులు, కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా నియమించారని నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పీతల సుజాత అంటే ఎవరో తెలియదని, అయితే తామంతా కలిసి కట్టుగా పనిచేసి పీతల సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించామని, అయినా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ ఒకసారి నేతలంతా రహస్య సమావేశం నిర్వహించి పీతల సుజాతకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. కొందరు స్వార్థ పరుల కోసం పార్టీకి కొండంత బలమైన కార్యకర్తలు, నాయకులను మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇక ఉపేక్షిస్తే ప్రయోజనం లేదని, తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. త్వరలో భారీ సభ ఏర్పాటు చేసిన తమ నిర్ణయాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు.

పార్టీని చిన్నాభిన్నం చేశారని అభియోగాలు ఇలా
ఇటీవల భీమడోలులో జరిగిన పార్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సందర్భంగా, తర్వాత అమరావతిలో జరిగిన సమావేశంలోనూ పీతల సుజాత కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చారని నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు వెల్లడించారు. ర్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎమ్మెల్యే మాత్రం వర్గాలు తయారుచేసి తన వర్గానికే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి పరిచయం లేని పీతల సుజాతను పార్టీ ఆదేశాను సారం మంచి మెజార్టీతో గెలిపించామని చెప్పారు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆమె నియోజకవర్గాన్ని చిన్నాభిన్నం చేశారని తెలిపారు. భీమడోలులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తదితరులు హామీ ఇచ్చినా నేటికీ తమ మధ్య సయోధ్య కుదరలేదని వెల్లడించారు.
నియోజకవర్గం నాలుగు మండలాల్లో కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐ.వి.ఆర్.ఎస్ ద్వారా ఎంపికని ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్నవారికి పదవులు కట్టబెట్టారని, ఇది పార్టీలో సహించరానిదని వాపోయారు. కేవలం పీతల సుజాత వల్ల నియోజకవర్గంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో సమావేశాన్ని ఏర్పాటుచేసి ఒక నిర్ణయానికి రానున్నట్టు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ పరిస్థితి గురించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications