ఆ ఎనిమిది మందీ ఆసుపత్రికి చేరకముందే: 10కి చేరుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య
విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువులు వెలువడిన ఘటనలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆరేళ్లలోపు చిన్నారి మృత్యువాత పడటం కలచి వేస్తోంది. మృతులందరూ ఆసుపత్రికి చేరకముందు కన్నుమూశారు. మార్గమధ్యలోనే తుదిశ్వాసను విడిచారు. మృతుల్లో ముగ్గురు వెంకటాపురం గ్రామానికి చెందిన వారే.
విశాఖపట్నం నగర శివార్లలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ తెల్లవారు జామున విషవాయువులు వెలువడ్డాయి. విషవాయువు ప్రభావం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కళ్లు మండుతూ, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుండడంతో ప్రజలు ఇళ్లను వదిలి రోడ్డు మీదికి పరుగులు తీశారు. ఊపిరి అందక విలవిల్లాడిపోయారు. ఎక్కడికక్కడ సృహతప్పి పడిపోయారు.
వారిలో అయిదుమంది స్పృహ తప్పిన స్థితిలో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విష వాయువుల ప్రభావం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడం వల్ల మరో ముగ్గురు మృతి చెందినట్లు చెప్పారు. మృతుల్లో అప్పల నరసమ్మ (45), ఎ చంద్రమౌళి, సీహెచ్ గంగరాజు (48), ఆర్ నారాయణమ్మ (25), మేకా కృష్ణమూర్తి (73) మరణించారు. కుందన శ్రేయ, ఎన్ గ్రీష్మ అనే చిన్నారులు మరణించారు. కుందన శ్రేయ వయస్సు ఆరేళ్లే. గ్రీష్మ వయస్సు 9 సంవత్సరాలు. మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 300 మంది చికిత్స పొందుతున్నారు.
Recommended Video
కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతుల్లో అయిదు మంది స్పృహ తప్పిన తరువాత మళ్లీ కళ్లు తెరచి ఉండకపోవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు. స్పృహ తప్పిన స్థితిలోనే వారు మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. మరో ముగ్గురు స్పృహలోనే ఉన్నప్పటికీ.. విష వాయువులు కమ్మేయడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల మృతి చెంది ఉంటారని చెబుతున్నారు.