విశాఖ దేశంలోనే పెద్ద ఐటీ హబ్: కేంద్రమంత్రికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
విశాఖపట్నం: బీజేజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు గురువారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని విశాఖపట్నం నగరాన్ని దేశంలోని పెద్ద ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు జీవీఎల్.
విశాఖను ఐటీలో మేటిగా తీర్చిదిద్దండి
విశాఖపట్నంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన వ్యవస్థను, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే వివిధ ఐటీ ప్రాజెక్టుల అనుమతులు, అమలు మంజూరు చేయడం, వేగంగా ట్రాక్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు, సహకారాన్ని అందించాలని జీవీఎల్ కోరారు. స్టార్టప్ కోసం అవసరమైన వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఇంక్యుబేషన్ సేవలను అందించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో విశాఖపట్నం సెంటర్లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) కార్యకలాపాలను విస్తరించాలని కేంద్రమంత్రికి విన్నవించారు.
ఐటీ అభివృద్ధి కేంద్రాలు విశాఖలో పెట్టాలంటూ జీవీఎల్
సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఫ్యాబ్రికేషన్ను ఉపయోగించి విద్యను, కనిపెట్టడానికి సాధనాలు, జ్ఞానం, ఆర్థిక మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖపట్నంలో ఫ్యాబ్రికేషన్ లేబొరేటరీ(ఫ్యాబ్లాబ్) ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడీఏసీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జీవీఎల్ కేంద్రమంత్రిని కోరారు.
విశాఖతోపాటే ఏపీ నగరాలకు ఐటీలో రాణిస్తాయన్న జీవీఎల్
విశాఖపట్నం తోపాటు ఏపీలోని ఇతర జిల్లాలు, నాన్ మెట్రోపాలిటన్ నగరాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు బీపీఓ ప్రోత్సాహఖ పథకాన్ని కొనసాగించాలని జీవీఎల్ కోరారు. మరోవైపు, దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినందుకు కేంద్రమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు జీవీఎల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా విశాఖపట్నంను దేశంలోనే ప్రధాన ఐటీ అభివృద్ధి కేంద్రంగా పరిగణించి మద్దతునివ్వాలని విన్నవించారు. ఐటీ రంగంలో అభివృద్ధిని సాధించేందుకు ఏపీ, విశాఖకు పుష్కలంగా ఉన్నాయని జీవీఎల్ నర్సింహారావు వివరించారు.