సిగ్గు పడవయ్యా విజయసాయి .. దమ్ముంటే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ట్వీట్ చెయ్ .. అన్న దేవినేని
వైసీపీ నేత , రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం చేసిన వ్యాఖ్యలకు , పోలవరం టెండర్లు రద్దు చేసి వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలకు ఇప్పుడు కేంద్ర మంత్రి మాటలు బలం ఇచ్చాయి . ఇక ప్రతి దానికి ట్విట్టర్ వేదికగా స్పందించే విజయసాయిని పోలవరం వ్యవహారంలో టార్గెట్ చేసిన దేవినేని ఉమా కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపధ్యంలో తూర్పారబడుతున్నారు .

కేంద్ర మంత్రి షెకావత్ ప్రశ్నలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన దేవినేని
విజయవాడలో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిశాక దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీస అవగాహన కూడా లేకుండా టెండర్లు రద్దు చేశారని , కనీస జ్ఞానం కూడా లేదని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న మాజీ మంత్రి దేవినేని ఉమ కేంద్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ సంధించిన ప్రశ్నలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు . ఇక పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు .

వరద సమయంలో నిర్మాణ సంస్థలను బయటకు గెంటేస్తే ఎవరు పర్యవేక్షిస్తారో చెప్పాలన్న దేవేనేని ఉమా
అంతే కాదు ప్రస్తుతం వరద పోటెత్తే సమయంలో నిర్మాణ సంస్థలను బయటకు పొమ్మని ఎక్కువ వరద వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. వారుంటే కనీసం వరద ఎఫెక్ట్ నిర్వాసిత గ్రామాలపై పడకుండా ఏదైనా ప్రయత్నం చేసేవారని మండిపడ్డారు. ఈరోజు పోలవరం డ్యామ్ నుంచి 10 లక్షల క్యూసెక్కులపై పైగా వరద నీరు కిందకు వెళుతోంది. 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలను బయటకు రమ్మన్నారంటే పోలవరం ప్రాజెక్టుపై మీకున్న చిత్తుశుద్ధి ఏముంది? వరద పోటెత్తుతున్న తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా బయటకు రావాలని చెప్పడం వెనుక మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి? మీ బాధ్యత ఏంటి అని అడుగుతున్నానని ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇక ఇంకా బాధ్యత లేకుండా విజయసాయిరెడ్డి మాపైన ట్వీట్ చేస్తున్నాడు అని మండిపడ్డారు .

లోక్ సభలో పోలవరం మీద కేంద్రమంత్రి మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలయ్యా నువ్వు అన్న దేవినేని
ఇక తాజాగా కేంద్రమంత్రి లోక్ సభలో పోలవరం మీద మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలయ్యా నువ్వు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తున్నావ్. కేంద్ర మంత్రులు ఈ విధంగా లోక్ సభలో మాట్లాడుతుంటే అయినా చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుపడవయ్యా విజయసాయిరెడ్డి.. సిగ్గుపడు అని ఘాటుగా విమర్శించారు ఉమా . పరిగెత్తే ప్రాజెక్టుకు కాలు అడ్డం పెట్టారు. దీనికి మేం బాధపడుతున్నామని అని పేర్కొన్న దేవినేని ఉమ ఓ పవర్ ప్రాజెక్టు కోసమే పోలవరం టెండర్ ను రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే కేంద్ర మంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేయాలన్నారు.మాటిమాటికీ ఏవేవో ట్వీట్ లు పెట్టటం కాదు కేంద్రమంత్రి మీ తప్పులను ఎత్తి చూపారు. వాటి మీద పోస్ట్ పెట్టవయ్యా దమ్ముంటే అని సవాల్ విసిరారు దేవినేని ఉమా .












Click it and Unblock the Notifications