పది మంది ఆర్థిక నేరస్థులు: బాబు చైనా పర్యటనపై దేవినేని నెహ్రూ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చైనా పర్యటనపై ఆంధ్రప్రదేశ్ పిసిసి ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కలిసి చైనా వెళ్లిన వారిలో 10 మంది ఆర్థిక నేరస్తులు ఉన్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్థిక నేరస్తులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి ఏపీ పరువు తీశారని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తుల చరిత్రను త్వరలో సాక్ష్యాధారాలతో బయటపెడతానని నెహ్రూ తెలిపారు. ప్రస్తుతానికి కొంత మంది వివరాలు సేకరించగలిగామని చెప్పారు. ఆర్థిక నేరస్తులను తీసుకెళ్లి పెట్టుబడులు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు.
కాగా, అగ్రిగోల్డ్ వ్యవహారంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ.20 కోట్ల ముడుపులు అందాయని దేవినేని నెహ్రూ ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైతులను అండగా ఉంటామని దేవినేని నెహ్రూ తెలిపారు.