ప్రత్యేక హోదాపై దేవినేని, 'ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కొత్త ఉద్యమం'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం నాడు అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.
ఏలూరులోని తమ్మిలేరు దగ్గర కృష్ణ కాలువకు జరుగుతున్న నీటి మళ్లింపు పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ.. తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
వెంకయ్య మాట్లాడరేం?
ప్రత్యేక హోదా క్రెడిట్ అంతా తనదేనని గతంలో చెప్పుకున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసమని, లేకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్నారు.
పార్లమెంటులో పది రూపాయలకే బిర్యానీ తింటున్న ఏపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలను మాత్రం గాలికొదిలేశారన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం వరకు ఆయన చేపట్టిన బస్సు యాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది.
నిధులు ఆగిపోతాయి: మాజీ మంత్రి
ప్రత్యేక హోదాపై ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు మాట్లాడితే, వచ్చే ప్యాకేజీలు కూడా ఆగిపోతాయని, ఆ తర్వాత కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయని మాజీ మంత్రి, రాయలసీమ నేత టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ఆంధ్రాతో పాటు రాయలసీమ అభివృద్ధి చెందకుంటే ప్రజలు పోరుబాటలో నడుస్తారన్నారు.
కర్నూలును రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు ప్యాకేజీలపై నోరు మెదపడం లేదన్నారు. విభజన సమయంలో చివరి కోరికగా ప్రత్యేక హోదాను ఇచ్చారని, అభివృద్ధి పనులను దూరం పెట్టరాదన్నారు.