దగ్గుబాటీ! ఏ పార్టీ తరఫున, రాజకీయ నిరుద్యోగి, బాబు నీకూ నీళ్లిచ్చారు: దేవినేని
బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా స్పందించారు.
అమరావతి: బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా స్పందించారు.
బాబుకు షాక్: బాంబు పేల్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఉండవల్లి ఆగ్రహం
దగ్గుబాటీ! ఏ పార్టీ తరఫున వెళ్లావో చెప్పు
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉండవల్లిలు ఏ పార్టీ తరఫున వెళ్లారో చెప్పాలని దేవినేని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి కనీసం పట్టిసీమ ప్రాజెక్టును చూడకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు.
చంద్రబాబు మీ పొలాలకూ నీళ్లందించారు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గ్రామమైన కారంచేడు పొలాలకు నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని దేవినేని అన్నారు. ఆయన పొలాలకూ నీళ్లు అందించిన పట్టిసీమను చూడకపోవడం వారి వైఖరికి నిదర్శనమన్నారు.
రాజకీయ నిరుద్యోగులు
పట్టిసీమను సందర్శించి ఆ గోదావరి తల్లి నీళ్లను నెత్తిమీద చల్లుకున్నా వీరిద్దరికి జ్ఞానోదయం అయ్యేదని దేవినేని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్లు పనులు, కొండరాళ్ల తొలగింపు పనులు చూడకుండా హెలికాప్టర్ దగ్గర 20 నిమిషాలు ప్రభుత్వాన్ని తిట్టడానికి ఈ రాజకీయ నిరుద్యోగులు ఏ పార్టీ తరఫున వెళ్లారో చెప్పాలన్నారు.
మీరు ఖాళీ చేయించలేకపోయారు
పోలవరం డ్యామ్ సైట్ నుంచి 7 గ్రామాలను గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఖాళీ చేయించలేక పోయారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక గ్రామాల ప్రజలను వారి ఆమోదంతో వారికి మంచి ప్యాకేజీ కల్పించి ఖాళీ చేయించామన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలపై ఉన్న నమ్మకం అన్నారు.
మోడీ సహకారంతో..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తే, 300 అడుగులు గోదావరి గర్భంలో కాంక్రీట్ పనులు చేస్తే కనీసం వాటిపై మాట్లాడటానికి నోరు రాలేదన్నారు. 2018 నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి, 2019కి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి మహా సంకల్పం తీసుకున్నారన్నారు. కేంద్రం సహకారంతో పూర్తి చేస్తామన్నారు.